41 రోజుల టెన్షన్కు తెరపడి..ఏపీలో ఎవరు విజేతలో తేలిన సంగతి తెలిసిందే. చిన్న,పెద్ద లేకుండా ప్రతి ఒక్కరు టీవీలు, సోషల్ మీడియాలకు అతుక్కుపోయి మరీ వీక్షించిన ఎన్నికల్లో వైసీపీ గెలుపు సుస్పష్టం అయింది. ఈ గెలుపుపై రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలోని నేతలు సైతం స్పందిస్తున్నారు. తాజాగా బీజేపీకి చెందిన సీనియర్ నేత ఒకరు వైఎస్ జగన్కు ఆసక్తికర వినతి చేశారు.
బీజేపీ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఓ ట్వీట్లో జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. ``ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అద్భుత విజయానికి YS జగన్ గారికి అభినందనలు. ప్రజలు మెచ్చుకునేలా మీ పరిపాలన ఉంటుందని ఆశిస్తాం. ప్రధాని మోడీగారితో టీం ఇండియా స్ఫూర్తితో పనిచేసి ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తారని, చంద్రబాబుగారి మార్కు నెగటివ్ రాజకీయాలు చేయరని ఆశిస్తాము.`` అని పేర్కొన్నారు.
కాగా, జాతీయ పరిణామాల గురించి పేర్కంంటూ...``కేంద్రంలో మోడీగారి పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. చారిత్రాత్మక విజయాన్ని బీజేపీకి ఇచ్చారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ అవినీతికి, అహంకారానికి, ప్రచారానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. బీజేపీని దూషించి లభించాలని టీడీపీ చేసిన ప్రయత్నం ఫలించక పోగా వికటించింది` అని పేర్కొన్నారు.
కాగా, ఓ ప్రకటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ``ప్రియమైన @ysjagan, ఆంధ్ర ప్రదేశ్ లో ఘన విజయాన్ని సాధించినందుకు అభినందనలు. మీ పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు ఇవే శుభాకాంక్షలు.`` అని కోరారు.