కృష్ణా జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఆసక్తిరేపిన నియోజకవర్గం మైలవరం. మంత్ర దేవినేని ఉమామహేశ్వరరావును ఈ సారి ఎలాగైనా ఓడించాలన్న కసితో ఉన్న వైసీపీ అధినేత జగన్ అక్కడ నుంచి ఆయన పాత ప్రత్యర్థి వసంత కృష్ణప్రసాద్ను రంగంలోకి దించారు. గతంలో నందిగామలో దేవినేని వర్సెస్ వసంత ఫ్యామిలీ మధ్య చిరకాల రాజకీయ వైరం ఉంది. ఉమా వసంత నాగేశ్వరరావుతో పాటు కృష్ణప్రసాద్ను ఓడించారు.
ఈ ఎన్నికల్లో జగన్ ముందుగా కృష్ణప్రసాద్ను విజయవాడ ఎంపీగా పోటీ చేయించాలని అనుకున్నారు. అయితే ఎలాగైనా ఉమాను ఓడించాలన్న కసితో ఉన్న కృష్ణప్రసాద్ పట్టుబట్టి మరీ మైలవరం సీటు తీసుకున్నారు. అక్కడ అప్పటి వరకు ఇన్చార్జ్గా ఉన్న జోగి రమేష్ను పెడనకు పంపగా.. అక్కడ కూడా జోగి విజయం సాధించారు. ఇక తన జీవిత ఆశయం దేవినేని ఉమాను ఓడించడమే అన్నట్టుగా ఓపెన్గానే చెప్పిన కృష్ణప్రసాద్ చివరకు ఉమాను ఓడించారు. ఇది ఓ సూపర్ రివేంజ్ డ్రామాగా నిలిచింది. దేవినేని ఉమామహేశ్వరరావుకు 96762 ఓట్లు రాగా.. వసంత కృష్ణప్రసాద్కు 1,09,293 ఓట్లు వచ్చాయి. ఓవరాల్గా వసంత 14 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
రాష్ట్ర వ్యాప్తంగా దిగ్గజనాయకుడిగా, టీడీపీ అధినేత చంద్రబాబుకు రైట్ హ్యాండ్గా వ్యవహరించిన మంత్రి దేవినేని ఉమా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటీ చేసిన నియోజకవర్గం ఇదే. ఇక్కడ నుంచి వరుసగా మూడో సారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టి... మళ్లీ వచ్చే చంద్రబాబు కేబినెట్లో మరింత మంచి పదవి పొందాలని కలలు కన్న దేవినేని ఉమా అదే రేంజ్లో ఇక్కడ పోటీ చేశారు. అయితే, నిత్యం వైసీపీని విమర్శిస్తూ.. జగన్ను సవాళ్లు రువ్విన నేపథ్యంలో దేవినేని ఉమాకు ఎట్టిపరిస్థితిలోనూ చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు వైసీపీ అధినేత జగన్. అందుకే జోగిని పక్కన పెట్టి మరీ వసంతను రంగంలోకి దించారు.
దాదాపు ఏడాదిన్నర ముందుగానే ఇక్కడ రంగంలోకి దిగిన కేపీ.. దేవినేనికి నువ్వా నేనా అనే రేంజ్లో పోటీ ఇచ్చారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉండడం, ఆర్థికంగా బలంగానే ఉండడంతో అంతా ఇద్దరికీ కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారు? అనేది చర్చకు దారితీసింది. ముఖ్యంగా టీడీపీలోనే తీవ్ర వ్యతిరేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న దేవినేనికి ఈ ఎన్నికలు ముచ్చెమటలు పట్టించాయి. ఇక, ఇక్కడ గెలిచి జగన్కు గిఫ్ట్గా ఇస్తానన్న కేపీ తన మాటను నిలబెట్టుకునేందుకు శ్రమించి ఆయన తన రివేంజ్ తీర్చుకున్నారు.