హోరాహోరీగా సాగిన లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం ముగిసిన నేపథ్యంలో ప్రధాని మోదీ సరికొత్త అవతారమెత్తిన విషయం గుర్తుండే ఉంటుంది.చార్ధామ్ యాత్రల్లో ఒకటైన ఉత్తరాఖండ్లోని పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించిన ఆయన శివభక్తుడిగా దర్శనమిచ్చారు. ప్రధాన ఆలయానికి 1.5 కి.మీ. దూరంలో ఉన్న గుహలో ధ్యానంలో నిమగ్నమయ్యారు. ఈ రోజు కేదార్నాథ్లోనే గడిపారు. ఇలా అందరి దృష్టిని ఆకర్షించిన ఉత్తరాఖండ్ రాష్ట్రం మొత్తం ఐదు సీట్లను బీజేపీకే కట్టబెట్టింది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మొత్తం 5 పార్లమెంటు సీట్లు ఉండగా తొలివిడతలోనే పోలింగ్ పూర్తయింది. 57.85 శాతం పోలింగ్ నమోదు అయింది. ఉత్తరప్రదేశ్లో అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటైన సమాజ్వాదీ పార్టీ–బహుజన్ సమాజ్ పార్టీ (ఎస్పీ–బీఎస్పీ)కూటమి మరో రెండు రాష్ట్రాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకొని యూపీతోపాటు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోనూ కలిసి బరిలోకి దిగాయి. అయినప్పటికీ బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. అయిదుకు అయిదు పార్లమెంటు స్థానాల్లో బీజేపీ ఘటన విజయం సాధించింది. ఉత్తరాఖండ్లోని గధ్వాల్ స్థానాల నుంచి సమాజ్వాదీ పార్టీ పోటీ చేయనుండగా మిగతా చోట్ల బీఎస్పీ తమ అభ్యర్థులను బరిలోకి దించింది. అయినప్పటికీ బీజేపీకి పోటీ ఇవ్వలేకపోయింది. బీజేపీ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే, కొన్ని చోట్ల కాంగ్రెస్, మరికొన్ని చోట్ల ఎస్పీ-బీఎస్పీ కూటమి అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు.