జనసేన అధినేత పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోవటం జన సైనికులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఫలితాల పై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ నేపథ్యంలో విజయవాడ జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. తన కడ శ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటానని పవన్ ప్రకటించారు. ``నేను రెండు స్థానాల్లో ఓడిపోయినా పారిపోయే ప్రసక్తే లేదు.
జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియ జేస్తున్న. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన జగన్ మోహన్ రెడ్డికి నా శుభాకాంక్షలు. కేంద్రంలో మరోసారి సత్తా చాటిన నరేంద్ర మోడీకి నా శుభాకాంక్షలు. ప్రజా పోరాట యాత్ర ల ద్వారా ప్రజలకు చేరువయ్యా. ప్రజా సమస్యలపై మరింత బలంగా పోరాటం చేస్తా`` అని పవన్ ప్రకటించారు.
కాగా ఏపీ ఎన్నికలపై జనసేన ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుందని సీ-ఓటర్ ఇండియా సర్వే పరోక్షంగా వెల్లడించింది. టీడీపీకి 36.5 శాతం ఓట్లు - వైఎస్ ఆర్సీపీకి 34.9 శాతం ఓట్లు పడ్డాయని సీ-ఓటర్ ఇండియా అంచనా వేసింది. జనసేన - దాని భాగస్వామ్య పక్షాలకు 20 శాతానికిపైగా ఓట్లు పడనున్నాయని జోస్యం చెప్పంది. అయితే రెండు చోట్లా పోటీ చేసిన పవన్ రెండింటా ఓటమి పాలయ్యారు.