ప్రియాంక గాంధీ వాద్రా...కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణం. ఉత్తర్ప్రదేశ్ ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి. ఆమె రాజకీయ అరంగేట్రంతోనే బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ప్రియాంక గాంధీని నియమించడంతోనే.. ఆమె ఓ మంత్రదండంతో రాష్ట్రంలో కాంగ్రెస్ అదృష్టాన్ని మార్చివేయగలరని పార్టీ కార్యకర్తలు ఆశించారు. ప్రియాంక కరిష్మాతో తమ విజయావకాశాలు మెరుగుపడుతాయని భావించారు. కార్యకర్తల ఆశలకు తగినట్టుగానే ఈ లోక్సభ ఎన్నికలలో తన ప్రచార శైలితో ప్రియాంక ఒకింత హల్చల్ చేశారు. అయితే, అవేమీ జరిగే పని కావని ఫలితాలతో తేలిపోయిందనే ప్రస్తుత ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
2004లో సోదరుడు రాహుల్గాంధీ ప్రచార బాధ్యతలను ప్రియాంక మొత్తం తానే భుజానికెత్తుకున్నారు. నాయనమ్మకు సిసలైన వారసురాలని, రూపంలోనే కాకుండా.. ఇందిరాగాంధీలా ప్రజల్లోకి అత్యంత సులభంగా చొచ్చుకుపోగలరని ప్రియాంక తన ప్రవర్తనతో రుజువు చేశారు. నాయనమ్మలోని ఉక్కు సంకల్పం తనలోనూ ఉందని చాటేందుకు ప్రయత్నించారు. ప్రధాని మోదీ విధానాలను ఎండగట్టడంలో దూకుడుగా వ్యవహరించారు. పంజాబీలో మాట్లాడటం, తాను ఢిల్లీ వాసినని చెప్పుకోవడం, మోదీ మద్దతుదారులను వెళ్లి కలుసుకోవడం వంటి చర్యలతో ఆమె ప్రజలకు బాగానే దగ్గరయ్యారు. గెలిచే వారిని లేదా బీజేపీ ఓట్లకు గండికొట్టే వారినే యూపీలో తమ అభ్యర్థులుగా ఎంపికచేశానని చెప్పారు.
అయితే యూపీ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె పార్టీ కార్యకర్తలను ఐక్యపరచడంలో మాత్రమే సఫలమయ్యారు. కానీ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలపై ఆమె ఎటువంటి సానుకూల ప్రభావం చూపలేకపోయారని ఫలితాలను బట్టి వెల్లడవుతున్నది. నిజానికి కాంగ్రెస్ అభ్యర్థులు పలు నియోజకవర్గాలలో ఎస్పీ-బీఎస్పీ అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీశారని పరిశీలకులు పేర్కొంటున్నారు. 2022లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఆశలు కల్పించాలంటే ఆమె ఇంకా ఎంతగానే శ్రమించాల్సి ఉంటుందని పరిశీలకులు పేర్కొంటున్నారు.