మధ్యప్రదేశ్.. కాంగ్రెస్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రం.. ఇటీవల అక్కడ జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకువెళ్లింది. బీజేపీని గద్దె దించి అధికారం అందుకుంది. ఇదే ఊపు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఉంటుందని కాంగ్రెస్ ఆశించింది.
కానీ ఆ ఆశలు అడియాలయ్యాయి. ఆరు నెలల క్రితమే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. బీజేపీ గాలి ఎంత బాగా వీచిందంటే.. కాంగ్రెస్ దిగ్గజాలు జ్యోతిరాది త్య సింధియా, దిగ్విజయ్సింగ్లాంటి మహామహులు కూడా కొట్టుకుపోయారు.
సీఎం కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ ఒక్కడే ఛింద్వారా స్థానం నుంచి గెలిచారు. రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్కు దక్కింది ఆ ఒక్క సీటే. ఓటమి ఎరుగని జ్యోతిరాదిత్య సిం ధియా.. గుణ నియోజకవర్గంలో లక్షన్నర ఓట్ల తేడాతో ఓడిపోయారు.
గతంలో ఓడిన చోటే గెలవాలనే పట్టుదలతో క్షేత్రస్థాయి నుంచి శ్రేణులను బలోపేతం చేసుకుంటూ వచ్చిన బీజేపీ జయకేతనం ఎగరేసింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ గెలిచి...తమకు తిరుగులేదని బీజేపీ రుజువు చేసింది. బీజేపీ వ్యూహాల ముందు హస్తం పార్టీ నిలవలేకపోయింది. ఈ ఆసక్తికర పోరులో...బీజేపీకే ఓటర్లు మద్దతిచ్చారు.