జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్కు ఈ ఎన్నికలు పూర్తి నిరాశపరిచాయి. ఆర్నెళ్లకుపైగా జనాల్లో ఉన్నా పవన్ గాజువాక, భీమవరం రెండు చోట్లా ఓడిపోవడంతో ఊహించని షాక్ తగిలింది ఇప్పుడు. ప్రజల్లో ఉన్నా.. ఆర్నెళ్లకు పైగా అన్ని జిల్లాలు తిరిగినా కూడా కనీసం ఒక్క చోట కూడా పవన్ను గెలిపించలేదు జనం. ఇదే ఇప్పుడు పవన్ అభిమానులను బాధ పెడుతున్న విషయం. కనీసం పవన్ను ఒక్కన్నైనా అసెంబ్లీకి పంపించి ఉంటే బాగుండేదని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
పార్టీకి క్షేత్రస్థాయిలో వ్యవస్థాగత నిర్మాణం లేకపోవడం, బరిలో దిగిన అభ్యర్థుల్లో చాలా మంది ఇదివరకెప్పుడూ ప్రజలకు తెలినవాళ్లు కాకపోవడం, పోటీగా టీడీపీ, వైసీపీ నుంచీ బలమైన అభ్యర్థులు బరిలో ఉండటం ఇలాంటి ఎన్నో అంశాలు జనసేనకు అవరోధాలుగా మారాయనే చెప్పొచ్చు. ఐతే... ఈ అవరోధాలు ఇప్పుడున్నట్లే వచ్చే 2024 ఎన్నికల్లో కూడా ఉండే అవకాశాలున్నాయి. అయినప్పటికీ జనసేన అధినేత పవన్ పట్టువదలకుండా తన దారిలో తాను వెళ్లాలి. ఏ మాత్రం ధైర్యం, స్థైర్యం తగ్గకుండా ముందుకెళ్లాలి. ఆయన నమ్మిన సిద్ధాంతాల్లో ఒకటైన అవినీతిపై పోరాటం ఆయన పార్టీని మున్ముందు నిలబెట్టే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఏపీలోని ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ రెండింటికీ అవినీతి మకిలి ఉందనీ, ఆ పార్టీలోని చాలా మంది నేతలపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని జనసేన నేతలు భావిస్తున్నారు. అలాంటి అవినీతి మచ్చలు జనసేనపై ఇంకా లేకపోవడమే భవిష్యత్లో జనసేనకు కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీపై అవినీతి మచ్చ పడకుండా జాగ్రత్త పడాలనీ, ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా తెలుగు ప్రజల హృదయాల్లో జనసేన గూడు కట్టుకుంటుందని జనసేనాని పార్టీ వర్గాలకు చెప్పినట్లు తెలిసింది.
ఇప్పటికిప్పుడు పవన్ ప్రత్యేకంగా చేయాల్సిన రాజకీయాలేం బ్యాలెన్స్ లేవు. మరో ఐదేళ్ల పాటు చూడటం తప్ప చేసేదేం లేదు. ఈ నేపథ్యంలో పవన్ మనసు సినిమాల వైపు వస్తుందా లేదా అని ఆసక్తిగా గమనిస్తున్నారు అభిమానులు. నిర్మాతలు మాత్రం ఈయన ఓడిపోయినందుకు కాస్త బాధ పడుతున్నా మళ్లీ సినిమాలు చేస్తాడేమో అని ఆశ పడుతున్నారు. అభిమానులకు కూడా ఇప్పుడు ఈ ఒక్క సంతోషమే మిగిలింది. ఆయన మళ్లీ సినిమాలు చేస్తే అంతకంటే కావాల్సిందేమీ లేదని వాళ్లు కూడా కోరుకుంటున్నారు. అయితే పవన్ మాత్రం ప్రజాజీవితంలో ఉంటానంటున్నారు. ప్రస్తుతం పవన్ తన భవిష్యత్ కార్యచరణపై తీసుకోవాల్సిన నిర్ణయాలు మిగిలిఉన్నాయిప్పుడు.