ఏపీలో తెలుగుదేశం పార్టీ ఓట‌మిపై ఆ పార్టీకి చెందిన మాజీ నేత‌, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సంతోషం వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద  మోత్కుపల్లి నర్సింహులు నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద మోత్కుపల్లి అనుచరులు బాణసంచా పేల్చారు. అనంత‌రం మోత్కుప‌ల్లి న‌ర్సింహులు మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు పాలన నుంచి ఆంధ్ర ప్రజలకు విముక్తి కలిగించినందుకు ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఏపీలో జగన్ గెలుపొందినందుకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉందని అన్నారు. ఎన్టీఆర్ మనోవాంఛ నెరవేరిందన్నారు. దశమగ్రహం అంతరించి పోయినందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.


నరరూప రాక్షసుడు అంతరించిపోయినందుకు ఆనందంగా ఉంద‌ని మోత్కుప‌ల్లి వ్యాఖ్యానించారు. ``ఏపీ ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు మేలైన రోజు. చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపినందుకు జగన్ కు శుభాకాంక్షలు చెబుతున్నాను. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన తరువాత ఈ దుర్మార్గుడు సీఎంగా ఉండొద్దని కోరుకున్నాడు. చంద్రబాబు దొంగ, ప్రజాద్రోహి. నిజస్వరూపం బయట పడేందుకు 25 సంవత్సరాలు పట్టింది. ఎవరైన వాడుకుని వదిలేసే నీచ సంస్కృతి ఉన్న వ్యక్తి చంద్రబాబు. నేను ఎన్టీఆర్ ప్రోద్బలంతో రాజకీయల్లోకి వచ్చా. చంద్రబాబు ఇంటి దగ్గర కాపలాగా కుక్కలా ఉన్న నన్ను మోసం చేశారు. రాజ్యసభ సీట్లు ఒక్కొక్కటి వంద కోట్లకు అమ్ముకున్నారు. నాకు గవర్నర్, రాజ్యసభ పదవీ ఇస్తానని చెప్పి మోసం చేశాడు.`` అని మండిప‌డ్డారు. 


చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి విజయవాడకు పారిపోయారని మోత్కుప‌ల్లి ఆరోపించారు. ``తెలంగాణలో పార్టీని బతికించుకుందామని అన్నందుకు నన్ను పార్టీ నుంచి అన్యాయంగా సస్పెండ్ చేశారు. తెలంగాణలో ప్రజలు చంద్రబాబును తరిమి కొట్టారు... ఏపీ ప్రజలు కూడా తన్ని తరిమి కొట్టారు. కేంద్రంలో చక్రం తిప్పుతా అన్నావ్... అది పిప్పర్ మెంట్ చక్రం. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని నాశనం చేశావు. దళితులకు అన్యాయం చేశావ్..  మాలమాదిగలకు మధ్య కొట్లాట పెట్టావ్.. వాళ్ళ ఉసురు తగిలి పోయావ్. తప్పులు సర్దిదిద్దుకున్నోడే లీడర్.. తప్పుల మీద తప్పులు చేసే వాడు నాయకుడు కాదు. నరరూప రాక్షసుడు అంతం అయినందుకు తెలుగు ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. 3500 తిరుపతి మెట్లు ఎక్కి దేవున్ని దర్శించుకున్నాను. చంద్రబాబును ఓడించాలని వెంకటేశ్వరస్వామిని మొక్కు కున్న. నా మొక్కు ఫలించింది. ఎన్టీఆర్ వంటి మహానుభావున్నీ బలిచేశావ్. పాపాల పుట్ట చంద్రబాబు. జగన్, జనం నిన్ను ఫుట్ బాల్ ఆడుకున్నారు`` అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: