అందరి అంచనాలను ఆలోచనలను తలకిందులు చేస్తూ వైఎస్ జగన్మోహనరెడ్డి నాయకత్వంలోని వైసీపీ 151 అసెంబ్లీ స్థానాల్లో విజయవంతంగా గెలిచి అధికారాన్ని హస్త గతం చేసుకుంది. ఇంకో వారం రోజుల్లోపలే కొత్త ప్రభుత్వం కొలువుదీర నుంది. ఈ నెల 30న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అనేది సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం సీఎస్గా కొనసాగుతున్న ఎల్వీ సుబ్రమణ్యంనే కొనసాగించే యోచనలో జగన్మోహన రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారుగా అజయ్ కల్లాంను నియమించే అవకాశాలు కూడా ఉన్నాయి.
జగన్మోహన రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ఎల్వీ సుబ్రమణ్యం కలసిన సందర్భంగా - అత్యవసర అంశాలు, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా ఈ నెల 30న ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సూచించినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని గురువారం తనను కలిసిన ఎల్వీ సుబ్రమణ్యంతో జగన్మోహన రెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. "జగన్ తో భేటీ సందర్భంగా తనను సీఎస్ గా ఎన్నికల సంఘం నియమించినందున నాకు ఏదైనా ఆప్షన్ ఉందా! అని అడిగారు. దీనికి స్పందనగా మీరు రిటైర్మెంట్ కావడానికి ఇంకా ఏడాది ఉందని తెలుసుకున్నాను. మా ప్రభుత్వంలో కూడా మీరే సీఎస్" అని ఎల్వీ సుబ్రమణ్యంకి జగన్మోహన రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసింది.
ప్రమాణ స్వీకారోత్సవానికి విజయవాడలో స్థలాన్ని పరిశీలించాలని జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. మరోవైపు, వైసీపీ మంత్రుల కోసం పేషీలు కూడా సిద్ధమవు తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ కల్లాం ను నియమించే సూచనలు ఉన్నాయి.