కేంద్రంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడి ఉంటే జగన్ జాతీయ స్థాయిలో ఇంకా చెలరేగిపోయేవాడని చెప్పొచ్చు.  అయితే జగన్ ప్రభంజనం గతంలో తెలుగునాట ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో సాగగా.. టీడీపీకి ఇదే అతిపెద్ద డిజాస్టర్. ఎన్నికల్లోట జగన్ గెలవడం ఖాయమని భావించిన వారు కూడా.. ఈ స్థాయిలో సీట్లొస్తాయని అంచనా వేయలేకపోయారు. వైఎస్ఆర్సీపీ ప్రభంజనాన్ని తట్టుకొని టీడీపీ నుంచి ఎంపీలుగా గెలిచింది ముగ్గురే. శ్రీకాకుళం నుంచి కింజరపు రామ్మోహన్ నాయుడు, విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్ మాత్రమే ఫ్యాన్ గాలికి ఎదురు నిలిచారు.


వీరు ముగ్గురు కూడా స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు. 25 స్థానాలకు గానూ 22 చోట్ల గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలో నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ (303), కాంగ్రెస్ (52), డీఎంకే (23) తర్వాత ఎక్కువ సీట్లు సాధించింది జగన్ పార్టీనే. కేంద్రంలోనూ బీజేపీ సొంతంగా అధికారంలోకి రావడంతో.. ఏ పార్టీ మద్దతు కూడా మోదీ సర్కారుకి అవసరం లేకపోయింది. ఎన్నికల తర్వాత ఎన్డీయే కూటమికి మెజార్టీ కంటే తక్కువ స్థానాలొస్తాయని.. టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు సపోర్ట్ చేస్తాయని భావించారు.


జగన్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఇతర డిమాండ్లను బీజేపీ ముందుంచి ఫలితం రాబడతారని భావించారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగానూ కేసీఆర్ అడుగులేశారు. కానీ 303 సీట్లతో బీజేపీ సొంతంగానే మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. గత ఎన్నికల్లో మిత్రపక్షాల అవసరం లేకుండానే అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. తమ రాష్ట్రాభివృద్ధి పట్ల అంత శ్రద్ధ పెట్టలేదనే భావన ఏపీ ప్రజల్లో ఉంది. భవిష్యత్తులోనూ కేంద్రం ఏపీ పట్ల ఉదాసీనతతో వ్యవహరిస్తే.. జగన్ ఎలా డీల్ చేస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: