ఈ సారి ఏపీ ఎన్నికల్లో టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు వైసీపీకి వన్సైడ్గా సపోర్ట్ చేశారు. అసలు సినిమా రంగం అంటే ఎప్పటి నుంచో టీడీపీకి అనుకూలంగా ఉంటూ వచ్చేది. ఎన్టీఆర్ సినిమా రంగం నుంచి రావడంతో ఆ రంగంలో ఉన్నవారిలో ఎక్కువ మంది సహజంగా ఆ పార్టీకే సపోర్ట్ చేశారు. చంద్రబాబు రెండుసార్లు సీఎంగా ఉన్నప్పుడు కూడా వారిలో ఎక్కువ మంది ఆయన వెంటే ఉన్నారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక ఇండస్ట్రీ తీరులో మార్పు వచ్చింది. కొంతమంది వైఎస్కు ఓపెన్గానే సపోర్ట్ చేశారు.
ఇక రాష్ట్ర విభజనతో చాలా మంది తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు ఓపెన్గానే సపోర్ట్ చేస్తున్నారు. ఇక తాజా ఎన్నికల్లో ఇండస్ట్రీ నుంచి చిన్నాచితకా హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి కొందరు సీనియర్ల వరకు వైసీపీ అధినేత జగన్కు సపోర్ట్ చేశారు. ఇక ఈ ఎన్నికల్లో సినిమా ఇండస్ట్రీతో లింకులు ఉన్న ముగ్గురు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో గెలిచిన బాలయ్య, రోజా మరోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బాలయ్య హిందూపురం నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించారు.
ఇక నగరిలో అందరూ ఓడిపోతుందని చెప్పిన రోజా వరుసగా రెండోసారి సంచలన విజయం సాధించారు. గతంలో బాలయ్య - రోజా కాంబినేషన్లో కూడా ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరు వరుసగా రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం నుంచి తొలిప్రయత్నంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన గత ఎన్నికల్లో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై ఓడిపోయి.. ఈ సారి ఘనవిజయం సాధించారు.
గ్రామస్థాయి నుంచి కార్యకర్తగా, అయ్యన్న శిష్యుడిగా పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసిన ఉమాశంకర్ చివరకు వైసీపీలో చేరి గురువునే ఢీ కొట్టారు. గత ఎన్నికల్లో ఓడినా నియోజకవర్గంలో పట్టు పెంచుకుని చివరకు అయ్యన్ననే ఓడించి రికార్డు సృష్టించారు. ఇక రాజమహేంద్రవరం ఎంపీగా గెలిచిన మార్గాని భరత్ కూడా యంగ్ హీరోనే.. ఒకటీ ఆరా సినిమాల్లో చేసిన భరత్ తక్కువ వయస్సులోనే ఎంపీగా గెలిచారు.