ఏపీలో ఈ ఎన్నికల్లో చాలా సెంటిమెంట్లకు చాలా మంది సీనియర్ నేతలు బలవ్వడమో... లేదా బ్రేక్ చేయడయో జరిగాయి. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన ఓ సీనియర్ నేత అందరూ అనుకున్నట్టే ఓ బ్యాడ్ సెంటిమెంట్కు ఈ ఎన్నికల్లో బలయ్యారు. ఈ నేత ఎవరో కాదు గుంటూరు జిల్లా పొన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్. తండ్రి వీరయ్య చౌదరి వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన నరేంద్ర 1994 ఎన్నికల్లో గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన వరుసగా ఓటమి లేకుండా వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు.
1994తో పాటు 1999 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచిన నరేంద్ర 2004లో గెలవడం ఓ రికార్డే. ఆ ఎన్నికల్లో జిల్లాలో అప్పుడు 19 ఎమ్మెల్యే సీట్లు ఉండగా 18 సీట్లలో వైఎస్ ప్రభంజనంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిస్తే పొన్నూరులో మాత్రం నరేంద్ర ఒక్కడే విజయం సాధించారు. ఆ గెలుపుతో హ్యాట్రిక్ కొట్టిన నరేంద్రను వైఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. నరేంద్ర మాత్రం టీడీపీలోనే ఉన్నారు. 2009లో నరేంద్రను ఓడించేందుకు వైఎస్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎన్నారై మారుపూడి లీలాధర్రావును రంగంలోకి దింపినా నరేంద్ర నాలుగోసారి గెలిచారు.
ఇక గత ఎన్నికల్లో ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణపై విజయం సాధించిన నరేంద్ర ఐదోసారి గెలిచారు. గత ఎన్నికల్లో గెలిచాక ఆయన మంత్రి పదవి ఆశించినా చంద్రబాబు మాత్రం ఆయనకు పదవి ఇవ్వలేదు. అందుకే కొద్ది రోజులుగా ఆయన అసంతృప్తితోనే టీడీపీలో కొనసాగుతున్నారు. ఇక తాజా ఎన్నికల్లో ఆయన గెలిస్తే ఆరో గెలుపుతో డబుల్ హ్యాట్రిక్ కొట్టినట్లయ్యింది. చివరకు ఈ ఎన్నికల్లో కిలారో వెంకటరోశయ్య చేతిలో ఓడిపోయారు. ఎన్నికలకు ముందు వరకు గుంటూరు ఎంపీగా బరిలో ఉన్న ఆయన్ను జగన్ చివర్లో మోదుగుల ఎంట్రీతో పొన్నూరుకు పంపగా ఇక్కడ సంచలన విజయం సాధించారు.