ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ జోరుకు సైకిల్ చిత్తయ్యింది. 151 అసెంబ్లీ సీట్లతో పాటు 22 ఎంపీ సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టించిన జగన్ పార్టీ నుంచి చాలా మంది రికార్డులు బద్దలు కొట్టారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన వారిలో 21మందికి పైగా 40 వేల ఓట్ల మెజార్టీ లభించింది. రాయలసీమలో మొత్తం 52 స్థానాలకు టీడీపీ కేవలం మూడు చోట్ల మాత్రమే నెగ్గింది. ఇక సీమలో ఎంపీ సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు అందరూ లక్ష ఓట్లకు తగ్గకుండా మెజార్టీలతో గెలిచారు. కడప, కర్నూలు, నంద్యాల, రాజంపేట, హిందూపురం, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు లాంటి ఎంపీ సీట్లలో వైసీపీ అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ 1.50 లక్షల పైనే ఉన్నాయి. వీరిలో ఎవ్వరూ ఇంతకు తక్కువ మెజార్టీతో గెలవలేదు.
ఇక ఈ క్రమంలోనే వైసీపీ నుంచి పోటీ చేసిన ఓ యంగ్ ఎంపీ దేశంలో అతి తక్కువ వయస్సులో ఎంపీగా గెలిచిన మహిళగా రికార్డులకు ఎక్కారు. విశాఖ జిల్లా అరకు పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించిన గొడ్డేటి మాధవి లోక్సభకు ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అమె వయస్సు ప్రస్తుతం 25 ఏళ్ల 3 నెలలు మాత్రమే. ఇప్పటి వరకు ఈ రికార్డు దుశ్యంత్ చౌతాలా పేరు మీద ఉండేది. 2014 ఎన్నికల్లో ఈయన హిస్సార్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. దుశ్యంత్ వయస్సు అప్పటికి 26 ఏళ్ల 13 రోజులు.
ఇక మాధవి ఇప్పుడు అరకు నుంచి పోటీ చేసి టీడీపీ తరపున పోటీ చేసిన రాజవంశీకుడు అయిన కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్పై 2 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. మాధవి ఎవరో కాదు సీసీఐ సీనియర్ నేత, పాడేరు మాజీ ఎమ్మెల్యే గొడ్డేటి దేవుడు కుమార్తె. పీటీ టీచర్గా పనిచేస్తోన్న ఆమె అనూహ్యంగా తక్కువ వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చి వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి సంచలన విజయం సాధించడంతో పాటు జాతీయ రికార్డు నెలకొల్పారు.
ఇక గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ ఉంచి పోటీ చేసిన కొత్తపల్లి గీత ఆ తర్వాత టీడీపీకి దగ్గరై... ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లింది. చివరకు ఈ ఎన్నికలకు ముందు తానే సొంతంగా ఓ పార్టీ పెట్టి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఏదేమైనా అరకు ఎంపీ సీటు మరోసారి వైసీపీ కంచుకోటగా నిరూపితమైంది.