బడా సంస్థల కక్కుర్తి బుద్ధిపై ప్రజల్లో చైతన్యం పెరుగుతుందనేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సహజంగా షాపింగ్మాల్స్ సహా ఇతర పెద్ద పెద్ద కేంద్రాలలో తమ సంస్థ లోగోతో ముద్రించిన క్యారీబ్యాగ్లను వినియోగదారుడికి ఉచితంగా ఇవ్వాలి కానీ...వాటిపై లోగో ముద్రించి...దానికి కూడా మన జేబుల నుంచి డబ్బులు గుంజుతుంటాయి ఆయా సంస్థలు. అలాంటి వారికి షాకిస్తూ, కొద్దిరోజుల క్రితం లోగో ముద్రించి ఉంటే ఉచితంగానే క్యారీబ్యాగ్ ఇవ్వాలని చండీగఢ్ రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పు గుర్తుండే ఉంటుంది. సరిగ్గా అలాంటి ఘటనే హైదరాబాద్లో జరిగింది.
వివరాల్లోకి వెళితే....ఉప్పల్ నివాసి శ్రీకాంత్ గతనెల 18న షాపర్స్స్టాప్లో వస్తువులు కొనుగోలు చేయగా.. ఆ వస్తువులను తీసుకెళ్లేందుకు ఇవ్వాల్సిన క్యారీబాగ్కు రూ.ఐదు వసూలు చేశారు. క్యారీబ్యాగ్కు చార్జీ చేస్తున్నందున ఎలాంటి లోగో ముద్రించని బ్యాగ్ ను ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని గుర్తించిన శ్రీకాంత్ తనకు జరిగిన అసౌకర్యాన్ని పౌరసరఫరాలభవన్లోని వినియోగదారుల వివాదాల పరిష్కార కేంద్రం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ వినియోగదారుల వివాదాల పరిష్కార కేంద్రం దీనిపై స్పందిస్తూ, షాపింగ్మాల్స్ తమ సంస్థ లోగోతో ముద్రించిన క్యారీబ్యాగ్లను వినియోగదారుడికి ఉచితంగా ఇవ్వాలని ఆదేశించింది. లోగో ముద్రించి ఉంటే ఉచితంగానే క్యారీబ్యాగ్ ఇవ్వాలని చండీగఢ్ రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును గుర్తుచేసింది. ఇందుకు విరుద్ధంగా క్యారీబ్యాగ్ను వినియోగదారుడికి విక్రయించిన బేగంపేటలోని షాపర్స్స్టాప్ మాల్కు రూ.ఏడువేల జరిమానా విధించింది.