ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబందించి ప్రస్తుత వాస్థవ పరిస్థితిని తెలిపే శ్వేతపత్రాలు విడుదల చేస్తామని కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. ప్రజలకు యధార్ధ పరిస్థితి తెలియ చెప్పవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎంతటి దారుణమైన కుంభకోణాలు జరిగాయో అందరికి తెలిసిన ఈ విషయాలపై ముందుగా శ్రద్ధ పెడతామని ఆయన అన్నారు.
రాజదాని ఎక్కడో ఆయనకు తెలుసు, అయినా ఎక్కడో వస్తోందని ప్రకటన చేసి చంద్రబాబు ఆయన బినామీలు తక్కువ రేటుకు బూములు కొనుగోలు చేశేలా వారికి అవకాశం ఇచ్చి మిగిలిన వారిని తప్పుదారి పట్టించారని అన్నారు. అంటే "ఇన్-సైడర్ ట్రేడింగ్" జరిగిందని చెప్పినట్లే. అంతేకాదు చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ కంపెనీకి కూడా అమరావతిలో భూమి ముందుగానే కొనుగోలు చేశారని ఆయన అన్నారు. లాండ్-పూలింగ్ పేరుతో ప్రజల నుంచి బలవంతంగా భూములను తీసుకున్నారని, అదే సమయంలో తమ పార్టీ పెద్దల భూములకు మినహాయింపులు ఇచ్చారని ఆయన అన్నారు.
భూములను దర్జాగా తనకు తనవాళ్ళకు తన ఇష్టం వచ్చిన ధరలకు కట్టబెట్టారని అది అసాధారణ సంచలన కుంభకోణమని అన్నారు. తనకు చంద్రబాబు మీద ఎలాంటి ద్వేషం లేదని, అయితే తన బాద్యత నిర్వహణలో తాను ఖచ్చితంగా ఉంటానని అన్నారు. తన ప్రభుత్వం అందరికీ ఆదర్శవంతంగా ఉంటుందని, అవినీతి అన్నది లేకుండా చేస్తానని జగన్ కాస్త నిర్ణయాత్మకంగానే ప్రకటించారు. గత నాయకత్వం దారి తప్పించిన వ్యవస్థలను ప్రక్షాళన చేస్తూనే వాటిని సరైన గాడిలో పెడతామని అత్యంత విశ్వాసంతో చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో పారదర్శక పాలన అందిస్తానని ప్రకటించిన కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన తొలి అస్త్రాన్ని బయటకు తీశారు. "రాష్ట్రంలో ప్రజల ధనం వృధా పోకుండా చూసేందుకు తాము రివర్స్-టెండరింగ్ విధానాన్ని చేపడతామన్నారు. ఏపీలోని ప్రభుత్వ ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగి ఉండవచ్చని జగన్ అనుమానం వ్యక్తం చేశారు. రివర్స్ టెండరింగ్ అంటే ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టులకు మరోసారి టెండర్లు పిలుస్తారు. గతంలో కంటే తక్కువ ధరకు ఎవరైనా టెండర్లు దాఖలు చేస్తే, ఆ ప్రాజెక్టు తక్కువ ధరకు టెండర్ వేసిన వారికి ఇస్తారు. దీన్ని బట్టి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులను టీడీపీ ప్రభుత్వం ఎక్కువ ధరకు కట్టబెట్టారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాము అలాగే టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనే విధంగా పారదర్శకంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. " అని జగన్మోహనరెడ్డి కొత్త అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు.
మా ప్రభుత్వం విప్లవాత్మకంగా ఉంటుంది. ఆరు నెలలు లేదా ఏడాది కాలంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. అవినీతి అనేదే లేకుండా ఎలా మార్చాలో చేసి చూపిస్తాం అని ఢిల్లీలో జరిగిన ప్రెస్-మీట్లో జగన్మోహనరెడ్డి ప్రకటించారు. ఎంత పెద్ద కుంభకోణమైనా దీనిని బట్టబయలు చేస్తామని, ముందు ముందు అలా జరగకుండా మేం ఆపగలమని చెప్పగలుగుతామని ఆయన అన్నారు.
టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్మోహనరెడ్డి ఆరోపణలు గుప్పించారు. ప్రాజెక్టులను ఎక్కువ ధరలకు కట్టబెట్టారని మండిపడ్డారు. టీడీపీకి అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లు, టీడీపీ సభ్యులైన వారికే ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని, దాని వల్ల ప్రజాధనం టీడీపీ నేతల జేబులోకి వెళుతుందని ఆరోపించారు. ఈ క్రమంలో జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న రివర్స్-టెండరింగ్ విధానం సంచలనానికి తెర తీయబోతుందని అంటున్నారు.
తనపై ఉన్న కేసుల గురించి అడిగిన ప్రశ్నకు సమాదానం చెబుతూ అది కాంగ్రెస్-టిడిపిలు కలిసి చేసిన కుట్ర అని ఆయన అన్నారు. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాని, కాంగ్రెస్ లో నేను ఉన్నప్పుడు కాని ఎలాంటి కేసులు లేవని జగన్ అన్నారు. తాను అసలు సచివాలయంలోకే వెళ్లలేదని, ఎవరికి పోన్ చేయలేదని, కావాలని పెట్టిన కేసులవని అందుకే ప్రజలు ఇంతగా ఆదరించారని ఆయన అన్నారు. ముప్పైన ఒక్కడినే ప్రమాణ స్వీకారం చేస్తానని,ఆ తర్వాత వారం పదిరోజులలో మిగిలిన మంత్రూను తీసుకుంటామని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడం తమకు ముఖ్యమని ఆయన అన్నారు.