మాట తప్పను.. మడమ తిప్పను! ఇది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తరచుగా జగన్ చెప్పిన మాట. ఈ మాట కోసమే ఆయన అతి పెద్ద కాంగ్రెస్ పార్టీని సైతం ఢీ అంటే ఢీ అని డీ కొట్టి బయటకొచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఓదార్పు యాత్రల విషయంలో ప్రజలకు తాను మాట ఇచ్చానని, ఈ విషయంలో ఎవరు అడ్డగించినా.. తాను మాత్రం ప్రజల వద్దకు వెళ్తానని చెప్పిన జగన్ అనేక నిర్బంధాలు, కేసులు ఎదుర్కొన్నా కూడా వెనుదిరిగి చూసుకోలేదు. అదేవిధంగా తన పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేయడంపైనా జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఆయన స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు విజ్ఞప్తి కూడా చేశారు. తన పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యే లపై వేటు వేయాలని కోరారు. అయితే, దీనికి కోడెల నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేసే వరకు అసెంబ్లీ గడప తొక్కనని ప్రతిజ్ఞ చేసి బాయ్ కాట్ చేశారు. ఆ దరిమిలా ఇప్పటి వరకు ఆయన అసెంబ్లీకి వెళ్లింది లేదు. ఈ క్రమంలోనూ అన్ని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ వంటివారు నోరు పారేసుకున్నారు. అసెంబ్లీకి వెళ్లని జగన్కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. అయినా కూడా జగన్ ఎక్కడా వెనుదిరిగి చూసుకోలేదు. జగన్ మాట ఎంత పటిష్టంగా ఉంటుందో చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
ఇక, ఇప్పుడు తాజాగా జగన తన మాటను నిలబెట్టుకునే క్రమంలో సంచలనం సృష్టించారు. ఈ ఎన్నికలకు ముందు టికెట్ల పంపిణీ విషయంపై జగన్ ఆచి తూచి వ్యవహరించారు. గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే, చిలకలూరిపేటలో సమన్వయకర్తగా ఉండి... దాదాపు నాలుగేళ్లుగా పార్టీ కార్యక్రమాలు చేసిన మర్రి రాజశేఖర్ను పక్కన పెట్టాల్సి వచ్చింది. దీంతో మర్రి తీవ్రస్థాయిలో నొచ్చుకున్నారు. దీనిని గమనించిన జగన్ పాదయాత్ర జరుగుతున్న ప్రాంతానికి మర్రిని ఆహ్వానించి బుజ్జంచారు. మన ప్రభుత్వం ఏర్పడ్డాక నీకు మంత్రి పదవి ఇస్తాను అని మాట ఇచ్చారు. ఇది జరిగి దాదాపు ఏడాది అవుతోంది.
అయినా కూడా జగన్ ఎక్కడా మర్రి విషయాన్ని మచ్చుకైనా మరిచిపోలేదు. తాజా ఫలితాల్లో విజయం సాధించిన 150 మంది(జగన్ కాకుండా)తో తాడేపల్లిలో మీటింగ్ పెట్టారు. దీనికి మర్రి రాజశేఖర్ను హాజరు కావాల్సిందిగా .. జగన్ ప్రత్యేకంగా ఫోన్ చేయించారు. అన్నను మీటింగ్కు ఆహ్వానించండి.నేను పిలిచానని చెప్పండి! అని జగన్ అనడంతో సీనియర్లు ఆయనకు ఫోన్ చేశారు. అయితే, తాను ఇప్పుడులోకల్లో లేనని,వచ్చాక అన్నను కలుస్తానని మర్రి చెప్పినట్టు తెలిసింది. త్వరలోనే ఏర్పాటు కాబోయే జగన్ కేబినెట్లో మర్రికి మంత్రి పదవి ఇచ్చేందుకు జగన్ కసర్తత్తు ముమ్మరం చేశారనడానికి ఇది ఉదాహరణగా నిలుస్తుందని అంటున్నారు సీనియర్లు.