ఏపీ నూతన సీఎం వైఎస్.జగన్ అప్పుడే విప్లవాత్మక, సంచలనాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టేస్తున్నారు. ఓ వైపు అధికారులు, ప్రభుత్వ పాలన విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై ఇప్పటికే నిర్ణయాలు తీసుకుంటోన్న జగన్ ఈ నెల 30న సీఎంగా ప్రమాణస్వీకారం చేయకముందే చాలా సంచలన నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. తాజాగా ప్రధానమంత్రి మోడీని కలిసిన అనంతరం జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లోనే కాకుండా... ఇటు వైసీపీ వర్గాల్లోనూ సంచలనం రేపుతున్నాయి.
అతి తక్కువ వయస్సులోనే... కనీసం మంత్రి పదవి కూడా చేపట్టకుండా ముఖ్యమంత్రి అయిన జగన్ ఆరు నెలల్లో ఉత్తమ గవర్నెన్స్ అంటే ఎలా ఉంటుందో ? తాను ఏపీ ప్రజలకు చూపిస్తానని చెపుతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తన పాలనలో పారదర్శకత జవాబుదారీతనం తెచ్చేందుకు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తానని చెప్పారు. ఒక్క రూపాయి కూడా అవినీతికి తావులేకుండా తాను సరికొత్త నిర్ణయాలు తీసుకుంటానని ప్రకటించారు. ఈ విషయంలో తనకు ఫైనల్గా ప్రజలే ముఖ్యమన్న విషయాన్ని జగన్ చెప్పేశారు.
అలాగే తాడేపల్లిలో తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో మీట్ అయిన సమావేశంలో సైతం జగన్ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ఎవరైనా అవినీతికి పాల్పడిన విషయం తన దృష్టికి వస్తే సహించేది లేదన్న విషయాన్ని కూడా జగన్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. ఎవరైనా తన పార్టీ నేతలు అవినీతి చేసిన విషయం తన దృష్టికి వస్తే పార్టీలో వారికి అదే రోజు చివరి రోజు అవుతుందని కూడా జగన్ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది.
ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన వారిలో చాలా మంది కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. రేపటి ఎన్నికల్లో వీరంతా తాము సంపాదన ధ్యాసలో పడి మితిమీరిన అవినీతికి పాల్పడితే అదంతా జగన్ మెడకే చుట్టుకుంటుంది.. అందుకే జగన్ ముందు జాగ్రత్తగానే వారికి వార్నింగ్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా తన అవినీతి చేయకుండానే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేసి జైలుకు పంపిందని.. ఇప్పుడు అవినీతి చేస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ? అర్థం చేసుకోవాలని చెప్పారట.
ఏదేమైనా చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో ఇక్కడ ఫట్ అయ్యారు. తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు అవినీతి చేస్తుంటే వారిని కంట్రోల్ చేయడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. చివరకు చంద్రబాబు సొంత పార్టీ వాళ్లు బ్లాక్మెయిల్ చేస్తేనే లొంగిపోవాల్సి వచ్చింది. టిక్కెట్ల విషయంలో కోడెల లాంటి సీనియర్లు ఓడిపోతారని తెలిసినా వారిని పక్కన పెట్టే సాహసం చేయలేకపోయారు. ఇప్పుడు జగన్ మాత్రం అవినీతి విషయంలో సహించనని సొంత పార్టీ నేతలకే ఈ రేంజులో వార్నింగ్ ఇవ్వడంతో ఆ హెచ్చరిక వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో గుబులు రేపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నిర్ణయం కరెక్టుగా అమలు చేస్తే ఏపీలో మంచి ఆదర్శప్రాయమవుతుంది.