ఏపీ ఎన్నికల చిత్రాల్లో మరో రికార్డు ఇది. ఏపీలో ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 163 మంది కోటీశ్వరులే ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్రిఫార్మ్స్(ఏడీఆర్) ఆదివారం వెల్లడించింది. నామినేషన్ సమయంలో అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఆస్తులు,ఆదాయం, కేసులు ఇతర వివరాలతో కూడిన రిపోర్ట్ ను విడుదల చేసింది. ఈసీ వెబ్ సైట్ లో చోడవరం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మారి అఫిడవిట్ అందుబాటులో లేకపోవడంతో ఆయన వివరాలు ప్రకటించలేదని రిపోర్ట్ లో పేర్కొంది.
అత్యధిక ఆస్తులు కలిగిన టాప్ టెన్ ఎమ్మెల్యే ల జాబితాలో రూ.668 కోట్లతో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మొదటి స్థానంలో నిలిచారు. రూ.510 కోట్లతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు . రూ.274కోట్లతో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ థర్డ్ ప్లేస్ లో నిలిచారు .
వీరి తర్వాతి స్థానాల్లో కావలి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి (రూ.242 కోట్లు ), వినుకొండ ఎమ్మెల్యే బోళ్ల బ్రహ్మ నాయుడు(రూ.173 కోట్లు ), దర్శి ఎమ్మెల్యే మాడిశెట్టి వేణుగోపాల్రావు(రూ.159కోట్లు ), పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (రూ.130 కోట్లు ), చిలకలూరిపేట ఎమ్మెల్యే రజిని(రూ.128 కోట్లు ), మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్(రూ.119 కోట్లు ), గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(రూ.83 కోట్లు )ఉన్నారు .
కాగా, ఎమ్మెల్యేల్లో 5 కోట్లకుపైగా ఆస్తులున్నవారు 117 మంది, రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లలోపు ఉన్నవారు 25 మంది, రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్లలోపు ఆస్తులు కలిగినవారు 27 మంది ఉన్నట్లు తెలిపింది.రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలలోపు ఆస్తులు ఉన్న ఎమ్మెల్యే లు నలుగురే ఉన్నారు . ఒక ఎమ్మెల్యే ఆస్తులు మాత్రం రూ.10 లక్షల్లోపు ఉన్నట్లు రిపోర్ట్ వెల్లడించింది.