తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేనంతగా పెను సంక్షోభం ఎదుర్కుంటోంది. ఆ పార్టీ చరిత్రలోనే దారుణమైన అపజయాన్ని మూటకట్టుకుంది. ఓ వైపు చంద్రబాబు మీద సొంత పార్టీలోనే లోలోపల అసమ్మతి జ్వాలలు రగులుకుంటున్నాయి. ఇంకోవైపు ఇప్పటికీ మారని లోకేష్ చేస్తున్న మాటల డ్యామేజ్ అంతా ఇంతా కాదు.
సరిగ్గా ఈ టైంలో అన్న గారికి మూడవతరం వారసుడు, ప్రముఖ హీరో అయిన జూనియర్ ఎన్టీయార్ ఈ రోజు హైదరాబాద్ లోని అన్న గారి ఘాట్ వద్దకు వచ్చి చేశారని చెబుతున్న కొన్ని కామెంట్స్ టీడీపీలో పెను దుమారాన్నే రేపుతున్నాయి. పొద్దున్నే పెద్దాయనకు నివాళి ఇద్దామని ఆత్రుతగా వచ్చిన ఎన్టీయార్ కు అన్న గారి ఘాట్ వద్ద పూలు లేకపవడం, అక్కడంతా అపరిశుభ్రంగా ఉండడంతో తెగ చికాకు పడ్డారట. ఏంటిది పెద్దాయనకు ఇలా జరగడం ఏంటి అని ఆవేదన వెళ్లగక్కారట.
వెంటనే తన అనుచరులతో సమాధిని శుభ్రం చేసి మరీ అక్కడ పుష్ప గుచ్చాలు ఉంచి ఘన నివాళి అర్పించారని టాక్. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీయార్ చేసారని చెబుతున్న కొన్ని కామెంట్స్ ఇపుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఇకపై అన్న గారి జయంతులు, వర్ధంతులు నేనే దగ్గరుండి చూసుకుంటానని, అన్న గారి ఘాట్ పనులను కూడా నేనే చూస్తానంటూ జూనియర్ చెప్పిన మాటలు టీడీపీకి మరోలా అర్ధమవుతున్నాయట.
ఇక మీదట టీడీపీని నేనే చూసుకుంటాను అని జూనియర్ అంటున్నట్లుగా టీడీపీ నేతలు అర్ధం చెప్పుకుంటున్నారుట. ఓ విధంగా ఏపీలో టీడీపీ పాలన, దారుణమైన ఓటమి ఇవన్నీ కూడా జూనియర్ కి కలత కలిగించాయని అంటున్నారు. అయితే ఆయన అందరూ అనుకుంటునట్లుగా ఇప్పట్లో రాజకీయాల్లొకి రాడని, సరైన సమయంలో రంగంలోకి దూకుతాడని అంటున్నారు. మరి ఆ సరైన టైం ఎపుడో ఏంటో కానీ. అంతవరకూ టీడీపీ ఎదురీదడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.