పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టలేము. నరేంద్ర మోదీ ఈ నెల 30 న రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమానికి ఆమె హాజరు కావటం లేదు అంటే డుమ్మా కొడుతున్నారన్న మాట.
"అందరు ముఖ్యమంత్రులతో సంప్రదించిన తర్వాతే నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు మంగళవారం నాడు ప్రకటించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 24 గంటలు కూడా తిరక్కుండానే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు" నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి దూరంగా ఉండాలని నిర్ణయించు కున్నట్టు మమత బుధవారంనాడు ఒక ట్వీట్లో పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ హింసాకాండలో మృతి చెందిన 54 మంది వ్యక్తుల కుటుంబాలను ప్రమాణ స్వీకారమహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించడమే మమత తాజా నిర్ణయానికి కారణమైంది.
ప్రమాణస్వీకారం అనేది ప్రజాస్వామ్య పండుగలాంటిదని, ఆలాంటి కార్యక్రమం ఏ పార్టీని కించపరచేలా ఉండకూడదని మమత ప్రస్తుత ట్వీట్ లో నిప్పులు చెరిగారు.
దేశ ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం కాబట్టి ప్రొటోకాల్ ప్రకారం హాజరవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పిన మమతా దీదీ, రెండోరోజే మాట మార్చారు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి తాను హాజరు కావడం లేదంటూ మమతా బెనర్జీ ఈ మేరకు ఓ లేఖ రాశారు.
కాగా బెంగాల్ లో జరిగిన హింసలో 54 మంది బీజేపీ కార్యకర్తలు మరణించారని అంటూ ఆ పార్టీ చేసిన ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఆరోపణలు అవాస్తవాలని, బెంగాల్ లో ఎలాంటి రాజకీయ హత్యలు జరగలేదని అన్నారు.
వ్యక్తిగత కారణాలతో పాటు, కుటుంబ కలహాలవల్లే ఆ హత్యలు జరిగాయని మమత పేర్కొన్నారు. ఆ హత్యలతో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా పశ్చిమ బెంగాల్లో చనిపోయిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలను కూడా ఆ పార్టీ ప్రధాని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడంపై మమత గుర్రుగా ఉన్నారు.
— మమతా బెనర్జీ, బెంగాల్ సీఎం