టీఆర్ఎస్ పార్టీపై మరోమారు విరుచుకుపడ్డారు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజల్లో టీఆర్ఎస్కు తిరస్కరణ మొదలైందని.. లోక్సభ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో ప్రశ్నించే గొంతుకకు ప్రజలు పట్టం కట్టారన్నారు. కరీంగనర్, నిజామాబాద్లో టీఆర్ఎస్ నేతల ఓటమిపాలయ్యారని.. టీఆర్ఎస్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందనడానికి ఇదే సంకేతమన్నారు. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని మీరు కుంటి సాకులు వెతికే పనిలో పడ్డారని అన్నారు.
టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి సిద్దిపేట, సిరిసిల్లలో మెజార్టీలు తగ్గడం టీఆర్ఎస్ పతనానికి సంకేతమని అన్నారు. ఏ రాజకీయ పార్టీకైనా వర్తమానంలో ప్రజల ఆదరణ ఎలా ఉందన్నదే ప్రామాణికమన్న రేవంత్.. ఐదు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కాదని ఐదేళ్ల క్రితం ఎన్నికల ఫలితాలతో పోల్చుకోవడం మీ అతి తెలివికి నిదర్శనమంటూ కేటీఆర్ను ఉద్దేశించి లేఖలో పేర్కొన్నారు. మల్కాజ్ గిరిలో తన గెలుపుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు గురివింద సామెతను గుర్తు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు.
'గత డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత నాలుగు నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 20 లక్షల ఓట్లు తగ్గిపోయాయి. మీ సొంత గడ్డ సిద్ధిపేట, మీరు ప్రాతినిధ్యం వహిస్తోన్న సిరిసిల్లలలోనే మెజారిటీలు దారుణంగా పడిపోయాయి. కరీంనగర్, నిజామాబాద్ లో మీ కుటుంబ సభ్యులు ఓడిపోయారు. టీఆర్ఎస్ గ్రాఫ్ వేగంగా పడిపోతోంది అనడానికి ఇదే సంకేతం. 2009లో సిరిసిల్లలో మీ పరిస్థితి ఏమిటి? చావుతప్పి కన్నులొట్టబోయినట్టు స్వతంత్ర అభ్యర్థి పై కేవలం 171 ఓట్లతో గట్టెక్కారు. అది కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో బతుకు జీవుడా అని బయటపడ్డారు. మల్కాజ్ గిరి ప్రజలు ప్రశ్నించే గొంతుకు పట్టం కట్టారు. వారిని అవమానించేలా మాట్లాడటం మీ అహంకారానికి నిదర్శనం. మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలేం అమాయకులు కారు. ఇప్పుడిచ్చిన షాక్ ట్రీట్ మెంట్ చాలకపోతే మరో షాక్ ట్రీట్ మెంట్ ఇస్తారు' అని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.