‘జగన్మోహన్
రెడ్డిని వరుణదేవుడు కూడా ఆశీర్వదించాడేమో’.. ఈ మాటలన్నది ఎవరో కాదు. తెలుగుదేశంపార్టీ
వీరాభిమాని అయిన ఓ క్యాబ్ డ్రైవర్. మొన్నటి
ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేష్ 40 వేల ఓట్ల మెజారిటితో గెలవాలని కోరుకున్నాడు
ఇదే డ్రైవర్. సరే ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయి కాబట్టి చాలామంది లాగే డ్రైవర్ కూడా
ఏమీ చేయలేకపోయాడు.
చంద్రబాబు అండ్ కో లాగే ఈ డ్రైవర్ కూడా వైసిపి అఖండ విజయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఈ నేపధ్యంలోనే గురువారం జగన్ ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇటువంటి సమయంలోనే బుధవారం అర్ధరాత్రి విజయవాడలో కుంభవృష్టి కురిసింది. దాంతో విజయవాడ పరిసర ప్రాంతాలంతా ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారిపోయింది. అంటే వైఎస్ హయాంలోనే వరుణదేవుడు కాంగ్రెస్ పార్టీలో చేరుడు లేండి. తర్వాత వైసిపిలోకి మారేడేమో ?
అదే విషయాన్ని సదరు క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ జగన్ ను వరుణదేవుడు కూడా ఆశీర్వదించాడేమో...ఏం చేస్తాం.. అంటూ నిర్వేదంగా నిట్టూర్చాడు. నిజానికి ప్రమాణ స్వీకారం ముందు రోజు కూడా రాష్ట్రంలోని అన్నీ ప్రాంతాల్లాగే విజయవాడ కూడా మండిపోయే ఎండలతో ఉడికిపోయింది. సీన్ కట్ చేస్తే రాత్రయ్యేసరికి ఉరుములు, మెరుపులతో కూడిన కుంభవృష్టి.
దాంతో ఒక్కసారిగా విజయవాడ వాతావరణం మొత్తం మారిపోయింది. ఎండలతో ఉడికిపోయిన బ్లేజ్ వాడ ఇపుడు చల్లగా మారిపోయింది. సరే ఇందిరాగాంధి స్టేడియం కూడా కుంభవృష్టి దెబ్బకు బురదమయం అయిపోయిందను కోండి అది వేరే సంగతి. అందుకే ఉదయాన్నే ఉన్నతాధికారులు స్టేడియంకు చేరుకుని యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. గాలి వాన దెబ్బకు దెబ్బతిన్న షామియానాలను మళ్ళీ సరిచేశారు.