కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు రాహుల్ గాంధీ నిరాకరిస్తున్న తరుణాన ఆ పార్టీ ఈ తరహా నిర్ణయం తీసుకోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎన్నికల్లో ఘోరపరాజయం తరువాత తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులెవరూ నెల రోజు ల పాటు మీడియా చర్చలకు వెళ్లొద్దని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.
పార్టీ అధికార ప్రతినిధులెవరూ మీడియా ఛానళ్లు నిర్వహించే చర్చా కార్యక్రమాలకు వెళ్లొద్దని కాంగ్రెస్ మీడియా ఇంఛార్జ్ రణ్దీప్ సింగ్ సుర్జేవాలా ప్రకటించారు.
మీడియా ప్రతినిధులను సైతం తమ పార్టీ నేతలను నెల రోజుల పాటు చర్చలకు ఆహ్వానించవద్దని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు రాహుల్ గాంధీ పూర్తిగా ఇష్టపడని వేళ . ఆ పార్టీ ఈ తరహా నిర్ణయం తీసుకోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.
అయితే ఇప్పటికప్పుడు పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం ఏమిటో పార్టీ నేతలకు కూడా అర్థంకావడం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంక్షోభం ఇప్పుడప్పుడే ముగిసిపోయే అవకాశం లేదని భావిస్తున్న అధిష్టానం, దీనిపై పార్టీ నేతలు ఏదిపడితే అది మాట్లాడితే కొత్త తలనొప్పులు వస్తాయని భావిస్తోంది.
అందుకే నాయకత్వం సంక్షోభం తొలిగిపోయేంతవరకు పార్టీ నేతలు ఏవరు కూడా మీడియా ముందుకు రాకుండా ఉండేలా అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం సంక్షోభం సహా అన్ని అంశాలపై ఒక క్లారిటీ వచ్చిన తరువాత మళ్లీ దీనిపై అధికార ప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి నెలరోజుల పాటు మీడియాకు దూరంగా ఉండాలన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని పార్టీ నేతలు ఎంతవరకు పాటిస్తారో చూడాలి.
అయితే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం నేపథ్యం లో పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు విముఖత చూపుతున్న రాహుల్ గాంధీ తదుపరి అధ్యక్షుడి గా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నేత ను ఎంపిక చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేతలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని సీనియర్ నేత లు రాహుల్ గాంధిని ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఆయన అందుకు సిద్ధంగా లేరని, వీలైనంత త్వరలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవాలని కోరుతూ ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
గాంధీ కుటుంబానికి చెందని నేత ను పార్టీ అధినేత గా ఎంపిక చేయాలని రాహుల్ గాంధి కోరుతుండటంతో ప్రియాంక గాంధీకి సారథ్య బాధ్యతలు దక్కే అవకాశం లేదని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీవర్గానికి చెందినవారికి ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ సూచించడంతో సమర్ధుడైన నేతను వెతికేపనిలో కాంగ్రెస్ సీనియర్లు నిమగ్నమయ్యారని తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులతో పాటు మిత్రపక్షాలకు చెందిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, డీఎంకే అధినేత స్టాలిన్, జేడీఎస్ అధినేత కుమారస్వామి తదితరులు కాంగ్రెస్ పార్టీ అధినేతగా కొనసాగాలని రాహుల్ గాంధిని కోరుతున్నా, అందుకు ఆయన మాత్రం సిద్ధంగా లేరు.