అంతా సవ్యంగా ఉందని అనుకుంటాం కాని సూక్ష్మంగా అసంతృప్తి, అసహనం, దాగి ఉంటూనే ఉంటాయి. అదే పరిస్థితి నేడు ఎన్డిఏలో స్పష్టంగా ప్రస్పుటమైనాయి. రెండోసారి దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తున్న గంట ముందు బీజేపీకి షాక్ తగిలింది. ఎన్డీయేలో కీలక పక్షమైన జేడీయూ తాము మంత్రి వర్గంలో చేరబోవడం లేదని తేల్చి చెప్పింది. కేవలం మిత్రపక్షంగానే కొనసాగుతామని జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. బీజేపీతో కలిసి బిహార్లో స్వీప్ చేసిన జేడీయూ సొంతంగా 16 ఎంపీ సీట్లను గెలుచుకుంది.
నిన్న భారత ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణం-303 లోక్ సభ స్థానాలను గెలుపొందిన బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించడం తో-మంత్రివర్గ కూర్పుపై ప్రధాని నరేంద్ర మోదీ, బిజేపి అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర కసరత్తు చేశారు. బీజేపీ నుంచి మంత్రి పదవులకు ఎక్కువ మంది ఆశావాహులు ఉండటంతో, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలపై ఆ ప్రభావం ఎంతో కొంత పడింది.
నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ- ఒక కేబినెట్ మంత్రి పదవి, ఒక స్వతంత్ర మంత్రిత్వ శాఖ, ఒక సహాయ మంత్రి పదవి ని ఆశించింది. కానీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపి- జేడీయూ కి ఒక మంత్రి పదవి మాత్రమే ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. బీజేపీ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి లోనైన జేడీయూ మంత్రి వర్గంలో చేరడం లేదని ప్రకటించింది. కానీ “ఎన్డీయే కూటమి” లోనే కొనసాగుతామని స్పష్టం చేసింది. బీజేపీ మరో మిత్ర పక్షమైన అప్నాదళ్ కు కూడా కేబినెట్లో చోటు దక్కలేదు.
‘జేడీయూ నుంచి ఒకరికి మాత్రమే నామ మాత్రంగా మంత్రి పదవి ఇస్తామని బీజేపీ చెప్పింది. దీంతో మాకు మంత్రిపదవి అక్కర్లేదని చెప్పాం. ఇది పెద్ద విషయమేమీ కాదు. మేం పూర్తిగా ఎన్డీయేలోనే ఉన్నాం. బీజేపీ నిర్ణయంతో నైరాశ్యానికి గురికాలేదు. మేం కలిసిపని చేస్తున్నాం. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు’ అని బిహార్, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తెలిపారు పైకి అంతా ఒకేలా కనిపించినా అయినా ఆయన కినుక వహించినట్లు సమాచారం.