కేవీపీ రామచంద్రారావు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీగా మాత్రమే ఆయన్ను పరిచయం చేస్తే అది ఖచ్చితంగా ఆయన స్థాయిని తగ్గించడం అవుతుంది. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ కేవీపీ. రాజశేఖర్రెడ్డి జీవించి ఉన్న కాలంలో కేవీపీ ఎంత చెపితే అంత. అది బయట వారికి కావచ్చు...రాజశేఖర్రెడ్డికి అయి ఉండవచ్చు. అయితే, ఆయన మరణానంతరం వైఎస్ కుటుంబంతో కేవీపీ సంబంధాలు తగ్గిపోయాయి. కట్ చేస్తే...త్వరలో కేవీపీ వైసీపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇటీవల ఓ మీడియా సంస్థతో కేవీపీ మాట్లాడుతూ, జగన్తో తన అనుబంధం తెగిపోయేది కాదని స్పష్టం చేశారు.జగన్ తనకు మేనల్లుడిలాంటి వాడని తెలిపారు. తమ అనుబంధం వ్యక్తిగతమని, రాజకీయాలకు సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు. జగన్ తాను ఎంచుకున్న దారిలో నడుస్తున్నారని కేవీపీ పేర్కొన్నారు. ప్రస్తుతం తాను జగన్తో ఎందుకు లేనన్న విషయాన్ని ఓపెన్గా చెప్పలేనని.. దాని గురించి చర్చించే సమయం ఇది కాదని వివరించారు. అనంతరం గురువారం జరిగిన వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కేవీపీ పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతగా ఉన్న కేవీపీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. అయితే, దీని వెనుక లెక్కలు వేరేనంటున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పేరొందిన కేవీపీ....కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు అయిపోయిన నేపథ్యంలో ఆ పార్టీలో ఉండలేకపోతున్నారని సమాచారం. మరోవైపు తన అత్యంత ఆప్తుడి కుమారుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అఖండ విజయంతో అధిరోహించిన నేపథ్యంలో...కేవీపీ ఆయనకు చేరువ కావాలని సిద్ధమైపోయినట్లు సమాచారం. అందులో భాగంగానే ప్రమాణ స్వీకారానికి కుటుంబ సభ్యులతో విచ్చేశారని చెప్తున్నారు. త్వరలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు పేర్కొంటున్నారు.