నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపి ప్రభుత్వం బహుశ తిరిగి అధికారంలోకి రాబోదని అనుకుందేమో ప్రధాని మోదీ భారత విభజన సారథి (ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్) అంటూ ఆయనను విమర్శిస్తూ రెండు వారాల క్రితం (సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు) కథనం ప్రచురించిన ప్రముఖ టైమ్ మేగజీన్, ఎన్నికల ఫలితాలు రాగానే మాట మార్చింది.
గత ఐదు దశాబ్దాల్లో నరేంద్ర మోదీలా దేశాన్ని ఎవ్వరూ ఐఖ్యం చేయలేక పోయారంటూ నరేంద్ర మోదీని ప్రశంశల్లో ముంచేస్తూ తాజాగా మరో కథనాన్ని ప్రచురించింది. పాత కథనాన్ని పాకిస్తాన్ మూలాలున్న ‘ఆతీష్ తసీర్’ అనే జర్నలిస్టు రాయగా, తాజా కథనాన్ని భారత్కు చెందిన ‘మనోజ్ లాద్వా’ రాశారు.
లండన్ కేంద్రంగా పనిచేసే ‘ఇండియా ఇన్-కార్పొరేషన్ గ్రూప్; అనే మీడియా సంస్థ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈవోనే ఈ మనోజ్ లాద్వా. 2014 లోక్సభ ఎన్నికల సమయం లో ‘ప్రధానిగా మోదీ’ అనే ప్రచార కార్యక్రమంలో పరిశోధన, విశ్లేషణ విభాగానికి మనోజ్ లాద్వా నేతృత్వం వహించారు.
నరేంద్ర మోదీ సమాజంలో మత పరమైన విభజన తీసుకువచ్చారని ఆతీష్ తసీర్ వ్యాసం ద్వారా ఆరోపించిన టైమ్ మేగజీన్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ భారీ విజయం సాధించడంతో - టైమ్ మేగజీన్ తన రూటు మార్చుకోవాల్సి వచ్చింది. నరేంద్ర మోదీ విభజన వాది కాదు, దేశాన్ని ఏకతాటి పైన నడిపిన నాయకుడు అంటూ మనోజ్ రాసిన సంపాదకీయంలో టైమ్ ప్రశంసించింది.
కుల, మత, వర్గ సమీకరణల్ని అధిగమించి మరీ మోదీ అధికారాన్ని నిలబెట్టు కోవడమే కాదు, సీట్లు, ఓట్లు పెంచుకున్నారని విశ్లేషించింది. భారత్లో నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అధ్యయనం చేయడంలో పశ్చిమ దేశాల మీడియా విఫలమైందని మనోజ్ అభిప్రాయపడ్డారు. ‘మోదీ అధికారం లోకి వచ్చాక అగ్రకులాల ఆధిపత్యం పెరిగిందని’ అందరూ భావించారు.
వెనుక బాటు కులాలే ఒక్కటై మోదీకి జేజేలు పలికాయి. ఒక వెనుక బడిన కులానికి చెందిన వ్యక్తి అత్యున్నత పీఠాన్ని అధిరోహించడం, ఉద్యోగ వర్గాలకు ప్రతినిధి గా ఆయన కనిపించడం, నిరుపేదలు అత్యధికంగా ఉన్న భారత్లో నరేంద్ర మోదీపై ఉన్న వ్యక్తిగత కరీష్మాయే ఆయనను రెండోసారి అధికార అందలాన్ని ఎక్కించింది. పాలనలో మోదీ విధానాలపై ఎన్నో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎన్నికల ప్రచారం సమయం లోనూ ఆయనను విపక్షపార్టీలు అన్నీ ఏకమై ఆయనపై తీవ్ర విమర్శలు చేశాయి. అయినా భారత ఓటర్లు మాత్రం ముందే నిశ్చయించు కున్నట్లు మూకుమ్మడిగా నరేంద్ర మోడీకే పట్టం గట్టారు. “ఈ స్థాయిలో ఓటర్లు ఒక్కటై ఒక వ్యక్తిని చూసి ఓటు వేయడం 50ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి” అని మేగజీన్ వ్యాసంలో పేర్కొంది.