ఆంధ్రప్రదేశ్ లో జగన్ గెలవక ముందు వరకు వరకు ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణకు పొరుగునే ఉన్న తమిళ రాష్ట్రానికి పెద్దగా సంబంధాలు లేవు. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణాల మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే విధంగా తయారైంది పరిస్థితి. జగన్ గెలిచిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలవడం, ప్రమాణస్వీకార మహోత్సవానికి ఆహ్వానించడం, అటు తమిళనాడు డిఎంకె అధినేత స్టాలిన్ ను పిలవడం ఆయనకు సరే అనడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
జగన్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార మహోత్సవానికి ముగ్గురు హాజరయ్యారు. ఒక్కమాటలో చెప్పాలి అంటే... జగన్ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని వెనకుండి నడిపించింది కెసిఆర్ అనే అంటారు. కెసిఆర్ అనుభవజ్ఞుడు కావడంతో జగన్ ను డైరెక్ట్ చేశారని వినికిడి. స్టాలిన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ముగ్గురు కలిసి భవిష్యత్తులో తమ రాష్ట్రాలకు రావాల్సిన నిధులను తెచ్చుకునే విషయంలో ఫైట్ చేయాలనీ, మూడు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంలో సహకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయం శుభసూచకమని చెప్పొచ్చు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించిన ఎన్నో అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. కృష్ణా, గోదావరి జలాలు పంపకాలు, ఆర్థికపరమైన విషయాలు ఇంకా చాలా పెండింగ్ లో ఉన్నాయి. వీటిని పరిష్కరించుకోవాలి అంటే ఇరు రాష్ట్రాల నేతల మధ్య సయోధ్య ఉండాలి. అప్పుడే సాధ్యం అవుతుంది. జగన్ ప్రమాణస్వీకారం సందర్భంగా ముగ్గురు కలిసిపోవడం విశేషం.