ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఏడు స్థానాల్లో ఓట‌మి పాల‌వ‌డం టీఆర్ఎస్ పార్టీకి షాక్ వంటిద‌నే సంగ‌తి తెలిసిందే. ఆ ఓట‌మి నుంచి తేరుకునేలా, గొప్ప భ‌రోసా ఇచ్చేలా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ విజ‌య‌దుందుబి మోగించింది. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌మ ప్ర‌త్య‌ర్థుల‌ను ప‌రోక్షంగా ఆడుకున్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధకి స్థానాలతో ప్రభంజనం సృష్టించిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కేటీఆర్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి విజయం అందించారో పరిషత్ ఎన్నికల్లో దాన్ని మించిన విజయాన్ని అందించారని అన్నారు. రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. 


దేశ చరిత్రలో, స్థానిక సంస్థల చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇంత ఏకపక్ష తీర్పు రాలేదని కేటీఆర్ అన్నారు. ``వందశాతం జెడ్పీ స్థానాలను కైవసం చేసుకోవడం ఇంతవరకు దేశంలో ఎక్కడా జరుగలేదు. ఇది చారిత్రక, అఖండ, అసాధారణ విజయం. టీఆర్ఎస్ చరిత్రలో ఇది అతిపెద్ద విజయం. దేశంలో ఏ పార్టీ సాధించని ఘనత టీఆర్ఎస్ సాధించిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ‌ ప్రజల చైతన్యానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. విజయంలో కీలకపాత్ర పోషించిన టీఆర్ఎస్ శ్రేణులకు అభినందనలు` అని అన్నారు. టీఆర్ఎస్ కు క్షేత్రస్థాయిలో ఎంత పటిష్టమైన పునాది ఉందో ఈ ఫలితాలే రుజువు చేస్తున్నాయని కేటీఆర్ అన్నారు. ఎన్నికల్లో కష్టపడ్డ జిల్లా పార్టీ ఇన్ ఛార్జిలకు అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పరిషత్ ఎన్నికల్లో ఏకపక్ష తీర్పునిచ్చారని తెలిపారు.


``ఆరు జిల్లాల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. మరో ఆరు జిల్లాల్లో విపక్షాలకు ఒక్కో స్థానం మాత్రమే దక్కింది. 32కు 32 జిల్లాల్లో జెడ్పీ పీఠాలను టీఆర్ఎస్ సొంతంగా కైవసం చేసుకుందన్నారు. ఓటు వేసిన ప్రజలందరికీ తలవంచి నమస్కరిస్తున్నా. పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో 7జెడ్పీటీసీలకు ఐదింటిలో విజయం సాధించాం. ఇది గెలుపు కాదు..ప్రజలు మనకిచ్చిన బాధ్యత. ఇంతటి ఘనవిజయాన్ని అందించి ప్రజలు మాపై బాధ్యతను మరింత పెంచారు. గులాబీ శ్రేణుల వల్లే ఈ విజయం సాధ్యమైంది. ప్రతిపక్షాలను తిరస్కరిస్తూ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు` అని కేటీఆర్ పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: