మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ ఏ కారణంతో అయితే విడిపోయిందో ఇంచూ మించూ అవే కారణాలతో తెలంగాణ నుంచి ఏపీ కూడా విడిపోయింది. వెనకబాటు తనం... ప్రాంతాల మధ్య సమాన అభివృద్ధి లేకపోవడమే తెలంగాణలో విభజన వాదానికి కారణమైంది. ఇక ఇప్పుడు ఏపీలో ఐదేళ్ల బాబు పాలనలో కూడా సమాన అభివృద్ధి ఎక్కడా జరగలేదు. చంద్రబాబు కేవలం తన సామాజికవర్గ పిచ్చితో విజయవాడ - గుంటూరు జిల్లాల మధ్యలో రాజధాని పెట్టి అక్కడే అభివృద్ధి జరిగేలా చేయడంతో పాటు వెనకపడిన ప్రాంతాలు అయిన రాయలసీమ, ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టలేదు.
విశాఖలో మాత్రం ఒకటో రెండో ఐటీ కంపెనీలు పెట్టి, హుదూద్ వచ్చినప్పుడు కాస్త సిటీని క్లీన్గా చేసి మమ అనిపించేశారు. ఇక ఇప్పుడు విభజన ఏపీలో రెండో అతి పెద్ద నగరంగా ఉన్న విశాఖకు జగన్ అదిరిపోయే వరం ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో కీలక నగరంగా ఉన్న విశాఖను ఏపీకి రెండో రాజధానిగా చేస్తే ప్రాంతాల మధ్య సమాన సమతుల్యత ఉంటుందన్న సరికొత్త డిమాండ్లు వైసీపీ తెరమీదకు తీసుకు వస్తోంది. ఇప్పుడు ఈ విషయంలో జగన్ ఎలా ? స్పందిస్తాడు ? అన్నదే ఆసక్తిగా మారింది.
చంద్రబాబు సీఎం అయినప్పుడు విశాఖలోనే బాబు తొలి మంత్రివర్గ సమావేశం జరిగింది. అప్పట్లో విజయవాడలో సౌకర్యాలు లేకపోవడం.. బాబు మాటమాటకు చెట్టుకింద పాలన స్టార్ట్ చేశానని చెప్పడంతో తొలి మంత్రి వర్గ సమావేశం కోసం విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ వాడారు. ఆ తర్వాత హుదూద్ను మినహాయిస్తే విశాఖను చంద్రబాబు, టీడీపీ వాళ్లు పూర్తిగా మర్చిపోయారు. మళ్లీ ప్రాంతీయ అసమానతలు లేకుండా ఉండాలన్నా.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా విశాఖను మరింతగా అభివృద్ధి చేయాలన్న డిమాండ్లు వచ్చినా చంద్రబాబు పట్టించుకోలేదు.
ఇక ఇప్పుడు అనకాపల్లి నుంచి గెలిచిన గుడివాడ అమర్నాథ్ సరికొత్త డిమాండ్ను తెరమీదకు తీసుకువచ్చారు. తాము ఈ డిమాండ్ను జగన్ దగ్గర పెడతామని కూడా ఆయన చెపుతున్నారు. విశాఖను ఏపీకి రెండో రాజధాని చేయడంతో పాటు ప్రతి యేడాది మూడు నెలల పాటు విశాఖను రాజధానిగా చేసుకుని ప్రభుత్వాన్ని నడపాలని ఆయన చెపుతున్నారు. ఇక శీతాకాల అసెంబ్లీ సమావేశాలు కూడా విశాఖలోనే జరపాలని ఆయన కోరుతున్నారు. అప్పుడే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగి.. ప్రాంతాల మధ్య అసమానతలు తగ్గుతాయని ఆయన చెపుతున్నారు. మరి ఈ డిమాండ్కు సీఎం జగన్ ఎలా స్పందిస్తారో ? మరి విశాఖను రెండో రాజధానిగా చేసి ఉత్తరాంధ్ర ప్రజల కల తీరుస్తారో ? చూడాలి.