శృతిమించిన తెలివితో పోలీసుల చేతికి చిక్కిన ఓ ఆకతాయి నిర్వాకం ఇది.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకే తన తెలివితో షాకిచ్చాడు కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి. ఉప రాష్ట్రపతి సిఫార్సు లేఖను ఫోర్జరీ చేసిన ఆ ఘనుడు ఇంతకీ దాన్ని ఎందుకు వాడుకున్నాడంటే....తిరుమల వెంకటేశ్వరుడి దర్శనం కోసం. అందులోనూ...దేవుడిని దగ్గరగా చూడాలనే ఆలోచనతో ఇలా చేశాడట.
కర్నాటక రాష్ట్రం కోలార్ కు చేందిన ఏంబీఏ విద్యార్ధి కిషోర్ కుమార్ తిరుమల శ్రీవారి భక్తుడు. శ్రీవారి దర్శనం చేసుకునేందుకే.. ఇంటర్నెట్ ద్వారా లెటర్ ఫ్యాడ్ ను ఫోర్జరీ చేసి అందులో తన కుటుంబ సభ్యుల జాబితాను పోందు పరిచి.. ఆ లెటర్ ను టీటీడీ ఆఫీస్ లో సబ్మిట్ చేశాడు. ఆ లెటర్ ను గుర్తించిన జేఈవో కార్యాలయ సిబ్బంది.. అనుమానం రావడంతో టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. విజిలెన్స్ అధికారులు ఆ లెటర్ ను నకిలీగా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఫోర్జరీకి పాల్పడిన కిషోర్ కుమార్ గా గుర్తించి తిరుమల టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీవారిని అతి దగ్గరగా చూడాలనే ఉద్దేశంతో కిషోర్ ఇలాంటి ఆకతాయి తనానికి పాల్పడినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేశామని వెల్లడించారు.
తిరుమల బాలాజిపై ఉన్న భక్తిభావంతో...ఎంబీఐ చదివిన విద్యార్థి ఇలా తప్పుడు పనులు చేయడం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు.మరోవైపు వీఐపీల విషయంలో తాము అతి జాగ్రత్తగా వ్యవహరించకపోతే...ఇలా బురిడీ కొట్టించే వారి సంఖ్య తక్కువేం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం వర్గాలు అంటున్నారు.