వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి ఆయన తీసుకునే సంచలన నిర్ణయాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. యవనాయకుడు ఆలోచనలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రశంసలు పొందుతున్నారు. అత్యవపర సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారుతుంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏకంగా సీఎం క్యాబినెట్లోకి ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను తీసుకోనున్నట్లు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ వైఎస్సార్ఎల్పీ సమావేశంలో ఆయన పార్టీ ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. పలు విషయాలపై చర్చిస్తూ నేతలందరూ హవాక్కయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. 25 మందితో తన మంత్రి వర్గం ఉంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులకు తన క్యాబినెట్లో అవకాశం ఇస్తున్నట్లు..మరీ ముఖ్యంగా ఏకంగా తన క్యాబినెట్లో ఐదుగురు ఉపముఖ్యమంత్రులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గం వారికి స్థానం కల్పించనున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం.
అదేవిధంగా రాష్ట్ర ప్రజలు చాలా నమ్మకంతో ఓట్లు వేశారని , వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు సీఎం. మనం చేసే మంచి పనులే పార్టీని పటిష్టం చేస్తాయన్నారు. ఇక అవినీతి అనేదే లేకుండా పాలన అందించేందుకు సిద్ధమయ్యామని చెప్పారు. ముఖ్యంగా కాంట్రాక్టుల విషయంలో అవినీతి జరగవద్దంటూ సూచించారు. ఈ విషయంలో జూడిషియల్ నిర్ణయం ఉంటుందన్న సీఎం జగన్ ఎవరిమీద అయిన అవినీతి ఆరోపణలు వస్తే వెంటనే రివర్స్ టెండర్ ప్రక్రియ చేపడతామన్నారు.
పాలన పారదర్శకతతో ఉండాలని నిశ్చయించుకున్నానని, ఎవరి మీద అయినా అవినీతి ఆరోపణలు వస్తే ఉపేక్షించేదే లేదని స్పష్టం చేశారు.
సీఎం జగన్ నిర్ణయంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గం వారు నీరాజనాలు పలుకుతున్నారు. అన్నీ వర్గాల వారిని కలుపుకుంటూ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్యాబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులకు ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు ఇవ్వడమనేది చరిత్రగా అభివర్ణిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే యంగ్ అండ్ డైననమిక్ లీడర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 6నెలల్లోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని ప్రమాణ స్వీకారం రోజున జగన్ చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నెల కూడా కాకముందే జగన్ పై విశేష ప్రశంసలు కురిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.