రాహుల్ గాంధీ జాతీయ రాజకీయాలను మారుస్తాడని భావించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు కట్టబెట్టింది. ఈ బాధ్యతలు తీసుకున్నాక జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న అమేథీ నియోజక వర్గాన్ని కోల్పోయింది.
కేరళ వాయనాడ్ నుంచి కూడా పోటీ చేశాడు కాబట్టి అక్కడి నుంచి గెలుపొందాడు. లేదంటే కాంగ్రెస్ పార్టీ అభాసు పాలవ్వ వలసి వచ్చేది. ఇప్పుడు రాహుల్ గాంధీ ముందు చాలా పెద్ద లక్ష్యం ఉంది. 2024 ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని దేశంలో బలపడే విధంగా చూడాలి.
అధికారంలో ఉన్న బీజేపీ ఎక్కడ ఎలాంటి తప్పులు చేస్తుందో పసిగట్టి వాటిపై యుద్ధం చేయాలి. అప్పుడే ప్రజలు రాహుల్ గాంధీ మాటలను వింటారు. కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమావేశం అవుతూ వారిలో ధైర్యాన్ని ప్రోది చేయాలి. లేకపోతే మాత్రం పార్టీ ఇబ్బందులు పడుతుంది.
కొంతమేర బలంగా ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, కర్ణాటకలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నిత్యం ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ.. నాయకులతో మాట్లాడుతూ.. వారికీ సలహాలు ఇవ్వాలి. వారిచ్చే సలాహాలు సూచనలు తీసుకోవాలి. పార్టీని అన్ని రకాలుగా సిద్ధం చేసుకుంటే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ సిద్ధంఅవుతుంది. లేదంటే మరోసారి పరాభవం తప్పదు.