ప్రశాంత్ కిషోర్ చూపులు ఇప్పుడు బెంగాల్ పై నిలిచాయి. మమతా బెనర్జీ పిలుపుతో ఆయన బెంగాల్ కోటలోకి అడుగుపెట్టాడు. ఈరోజు దాదాపు రెండున్నర గంటల పాటు మమతా తో చర్చలు జరిపాడు. బెంగాల్ లో మరో రెండేళ్లలో ఎన్నిలకు జరగబోతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో మమతా పార్టీని డీకొట్టి అక్కడ జెండా ఎగురవేయాలని బీజేపీ చూస్తోంది. దీనికి సంకేతంగా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దాదాపు 18 స్థానాలను గెలుచుకుంది. ఈ గెలుపుతో బీజేపీలో ధైర్యం పెరిగింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే విధమైన గెలుపు సాధిస్తామని చెప్పడంతో దీదీలో కలవరం మొదలైంది.
130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి బెంగాల్ ఎర్రకోటను కూర్చడం సాధ్యం కాలేదు. కానీ దీదీ పట్టుదలతో బెంగాల్ లో ఎర్రపార్టీని ఓడించి అధికారాన్ని కైవసం చేసుకుంది. అధికారంలోకి వచ్చి ఇప్పటికి పదేళ్లు గడిచింది. దీంతో అక్కడి ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదు.
మళ్ళీ లెఫ్ట్ పార్టీలకు పట్టంగట్టే ఆలోచనలో బెంగాల్ ప్రజలు లేరు. మిగిలింది బీజేపీ. బీజేపీ జాతీయ వాదం, అభివృద్ధి నినాదంతో మొన్న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. ఇదే దూకుడుకు ఇలానే ప్రదర్శిస్తే.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఖాయం అవుతుంది. అందుకోసమే దీదీ ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ఎంత ఖరీదైనదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.