ఏపీలో మంత్రులు ఎవ‌రో తేలిపోయింది. మంత్రివ‌ర్గ ప్ర‌మాణ స్వీకారం నేప‌థ్యంలో..సీఎం జగన్ తన మంత్రివర్గం జాబితాను గవర్నర్ నరసింహన్ కు సమర్పించడంతో మంత్రిపదవులు దక్కించుకున్నది వీళ్లేనంటూ స్పష్టత వచ్చింది. అయితే, వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరుపొందిన రోజా పేరు మంత్రివర్గంలో లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేప‌థ్యంలో పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. 


మంత్రివర్గ కూర్పు సమయంలో జగన్ ఇదే విషయమై రోజాతో రెండుసార్లు చర్చించి నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. కొన్ని సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని క్యాబినెట్ కూర్పు చేశామని, అందుకే మంత్రివర్గంలో చోటు కల్పించలేకపోతున్నామని జగన్ తెలిపినట్టు సమాచారం. అంతేగాకుండా, పార్టీలో ఇన్నాళ్లపాటు రోజా చేసిన సేవలను ప్రస్తావించిన జగన్ ఆమెను విజయవాడలోనే అందుబాటులో ఉండాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది.


ఈ రోజు వైసీపీ శాసనసభాపక్ష భేటీ ముగిసిన తర్వాత రోజా మాట్లాడుతూ, తనకు మంత్రి పదవి వస్తుందని వంద‌ శాతం నమ్ముతున్నట్టు తెలిపారు. ఏ మంత్రి పదవి ఇచ్చినా న్యాయం చెయ్యడం, జగన్ కు మంచి పేరు తీసుకురావడమే తన లక్ష్యాలని చెప్పారు. కానీ, క్యాబినెట్ మంత్రుల జాబితాలో రోజా పేరులేకపోవడం చర్చనీయాంశంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: