ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి కేబినెట్ శనివారం కొలువు దీరనున్న సంగతి తెలిసిందే. మొత్తం 25 మంది సభ్యులతో కొలువు దీరనున్న ఈ కేబినెట్లో జగన్ ఎన్నో సంచలనాల్మక నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. దేశ చరిత్రలోనే ఏ కేబినెట్లో.. గతంలో ఏ సీఎం చేయని విధంగా ఏకంగా ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టనున్న జగన్ ముగ్గురు మహిళలకు చోటు ఇస్తున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరు ఎస్సీ వర్గానికి చెందిన మహిళలు కాగా.. మరో మహిళ ఎస్టీ వర్గానికి చెందిన వారు.
తొలిసారి కేబినెట్లో ముగ్గురు రిజర్వ్డ్ వర్గానికి చెందిన వారే మహిళలుగా కూడా ఉండడం ఓ రికార్డే. మాదిగ సామాజివకర్గం నుంచి తానేటి వనిత, మాల సామాజికవర్గం నుంచి మేకతోటి సుచరిత, ఎస్టీ వర్గానికి చెందిన పాముల శ్రీపుష్ప వాణి మంత్రులుగా ఈ రోజు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇక ఎస్టీ సామాజికవర్గ కోటాలో మంత్రిగా ఉన్న విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీ వాణి మంత్ర అవుతున్నారు. ఎస్టీ కోటాలో ఆమె మంత్రిగాను, ఉప ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇక పుష్పశ్రీ వాణి ఈ కేబినెట్లో అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. ఆమె అతి చిన్న వయస్సులోనే ఎస్టీ + మహిళా మంత్రిగా రికార్డులకు ఎక్కడంతో పాటు ఉప ముఖ్యమంత్రి కూడా కానున్నారు. ఆమె వయస్సు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. కురుపాం నుంచి ఆమె వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
చిన్న వయసులోనే మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందని శ్రీవాణి చెప్పారు. ముఖ్యమంత్రి తనకు గిరిజన సంక్షేమశాఖ కేటాయించవచ్చని ఆమె అంచనా వేస్తున్నారు.
పుష్ప శ్రీవాణి పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండల ఆడపడుచు. ఆమె విద్యాభ్యాసం అంతా ఇక్కడే జరిగింది. శ్రీవాణి ఇంటర్, డిగ్రీ జంగారెడ్డిగూడెంలోని శ్రీసూర్య డిగ్రీ కాలేజ్లో చదువుకున్నారు. ఆ తర్వాత ఆమె బీఈడీ వైజాగ్లో పూర్తి చేశారు. మెట్టునింట్లో అడుగు పెట్టిన ఆమె అక్కడ ఫ్యామిలీ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని చిన్నవయస్సులోనే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఏకంగా మంత్రి, ఉప ముఖ్యమంత్రి అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఎన్నో రికార్డులకు కారణమయ్యారు.