ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తోన్న కార్యక్రమాలు.. ఇప్పుడు కేబినెట్ కూర్పు చూస్తుంటే జగన్ భారత రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు పెద్ద దిక్సూచిగా మిగిలి పోనున్నారు. ఇంతకు ముందు జగన్పై చాలా ఆరోపణలు, విమర్శలు ఉండేవి... వీటిల్లో అన్ని నిజం అని చెప్పలేం... ఆ నాడు పచ్చ మీడియా చంద్రబాబు కోసం జగన్పై లేనిపోని ఆరోపణలు బయటకు వదిలేది. జగన్ను ఏదోలా బద్నాం చేసే కార్యక్రమంలో పచ్చ మీడియా పడరాని పాట్లు పడి ఇప్పుడు జగన్కు లభించిన అసాధారణ విజయాన్ని జీర్ణించుకోలేక కక్కలేక మింగలేక అన్న చందంగా వ్యవహరిస్తోంది.
జగన్ సీఎం అయ్యాక ఆయన చేస్తోన్న సంస్కరణలు, తీసుకుంటన్న నిర్ణయాలు చూస్తోన్న రాజకీయ విశ్లేషకులు జగన్కు ఇంత తక్కువ వయస్సులోనే ఇంత రాజకీయ పరిణితి ? ఎలా వచ్చిందా ? అని ఆశ్చర్యపోతున్నారు. వాస్తవంగా 2014 ఎన్నికలకు ముందే వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండేది.. ఆ టైంలో జగన్కు అంత రాజకీయ పరిపక్వత లేకపోవడంతో పాటు చిన్న చిన్న తప్పిదాలు జరగడంతో ఆయన అధికారానికి దూరమయ్యారు. ఇక తాజా ఎన్నికల్లో ఐదేళ్ల క్రిందట జగన్ను ఓడించిన ప్రజలే నేడు బ్రహ్మరథం పట్టి... అపారమైన విజయం కట్టబెట్టారు.
2014 ఎన్నికల్లో వైసీపీ అధికారానికి దూరం కావడానికి జగన్ నిర్ణయాలు కూడ కారణమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. ఆ తర్వాత జగన్ తన వ్యవహరశైలిలో మార్పు చేసుకొన్నాడని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఈ ఎన్నికల్లో జగన్ రాజకీయంగా తలపండిన నేతలను సైతం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతోన్న తీరు అద్భుతం. పదవులు దక్కలేదనే ఎవరూ కూడ మనస్తాపానికి గురవ్వవద్దని చెప్పడంతో పాటు.. ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయన్న విషయం చెపుతున్నారు.
ఇక భారతదేశంలోనే జగన్మోహన్రెడ్డిలా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోలేదు. కేబినెట్లో 60 శాతం మంది మంత్రులు బీసీ, ఎస్సీలే అంటే రాజకీయంగా అది పెను సంచలనమే. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై జగన్ జరుగుతోన్న పునః సమీక్షలు, సీబీఐని తిరిగి రాష్ట్రంలోకి ఆహ్వానించేలా జీవో జారీ చేయడం... పొరుగు రాష్ట్రాల సీఎంలతో అప్పుడే మంచి వాతావరణంలో చర్చలు జరపడం లాంటి అంశాలు అద్వితీయమే. ఏదేమైనా జగన్మోహన్రెడ్డి సీఎంగా తీసుకుంటోన్న సంచలన నిర్ణయాలు భారత రాజకీయాలకే ఓ దిక్సూచిగా మారుతున్నాయన్న టాక్ కూడా రాజకీయ మేథావుల్లో వినిపిస్తోంది.