ఏపీలో వైఎస్.జగన్ మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం దక్కుతుందని ఆశించిన వారిలో కొందరికి షాకులు తప్పలేదు. వీరిలో కొందరు సీనియర్లు ఉంటే.. మరికొందరు జూనియర్లు కూడా ఉన్నారు. జగన్ కోసం ముందు నుంచి కష్టపడిన వారిలో కూడా కొందరికి మంత్రి పదవులు రాలేదు. అయితే సామాజిక, ప్రాంతీయ సమీకరణల సమతుల్యత నేపథ్యంలో కొందరికి మంత్రి పదవులు రాకపోయినా... వారికి వచ్చే రెండున్నరేళ్ల తర్వాత అవకాశం కల్పిస్తామని కూడా జగన్ హామీ ఇచ్చారు.
అయితే మంత్రి పదవి రాని వారిలో కొందరు ఇప్పటికే అలక బూనినట్టు తెలుస్తోంది. వీరిలో వైసీపీ ఫైర్ బ్రాండ్, లేడీ ఎమ్మెల్యే ఆర్కె.రోజా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. నగరి నుంచి వరుసగా రెండోసారి గెలిచిన రోజా తనకు తప్పకుండా కేబినెట్లో చోటు దక్కుతుందని ఆశించారు. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు బలమైన వాయిస్.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేయడంతో సహజంగానే రోజాకు లేడీ కోటాలో మంత్రి పదవి ఖాయం అనుకున్నారు.
అయితే రెడ్డి సామాజికవర్గానికి కేవలం నాలుగు మంత్రి పదవులు మాత్రమే ఇచ్చిన జగన్... లేడీ కోటాలో ముగ్గురు మంత్రులను తీసుకున్నా వారిలో ఇద్దరు ఎస్సీ, ఒక ఎస్టీ మహిళ ఉన్నారు. దీంతో రోజాకు వచ్చే రెండున్నరేళ్ల తర్వాత జరిగే కేబినెట్లో మాత్రమే ఆశలు ఉన్నాయి. రోజా పార్టీ కోసం పడిన కష్టాన్ని వదులుకునే స్థితిలో లేని జగన్ ఆమెకు మరో ప్రయార్టీ ఉన్న పోస్టు కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అయితే రోజా మాత్రం ఇప్పటికే అలక బూనినట్టు తెలుస్తోంది.
జగన్ తొలి మంత్రి వర్గంలో తనకు స్థానం లభించనందుకు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా కినుక వహించారు. మంత్రి పదవిపై పూర్తి ధీమాతో ఉన్న రోజా జగన్ ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురయినట్లు తెలిసింది. ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకాకుండానే రోజా బెజవాడ నుంచి బయలుదేరి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేతలు ఆమెను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించారట.