జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు, చంద్రబాబు చేసిన విమర్శలు అందరికీ గుర్తే ఉంటాయి. జగన్ కు ఏం తెలుసు, పాలనా అనుభవం ఉందా .. అని వెటకారం చేసేవారు. అయితే జగన్ సైతం అప్పట్లో ప్రతీ అంశానికి సీరియస్గా స్పందించేవారు. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ స్టైల్ మారిపోయింది. పూర్తి పరిణితి చెందిన వ్యక్తిగా కనిపిస్తున్నారు. తన ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను తొలి వారంలోనే అమలు చేయటం ద్వారా టీడీపీ నేతల్లో కొత్త చర్చ మొదలైంది.
అదే విధంగా ప్రధానంగా కేబినెట్ కూర్పు గురించే ఎక్కువగా చర్చిస్తున్నారు. రెడ్డి మంత్రులు ఎక్కువగా ఉంటారని భావిస్తే..కేవలం నలుగురికే పరిమితం చేయటం అంతు చిక్కలేదు. అందునా టీడీపీ బీసీల పార్టీ అని ఇక చెప్పకొనే అవకాశం లేకుండా చేసారా అనే సందేహం వారిలో కనిపిస్తోంది. బీసీలు.. కాపుల కు ప్రాధాన్యత ఇవ్వటం జగన్ వేసిన రాజకీయ ఎత్తుగడ ఖచ్చితంగా టీడీపీకి నష్టం చేస్తుందని భావిస్తున్నారు. జగన్ భవిష్యత్ పరిణాలను అంచనా వేస్తూ..అధికారంలోకి రావాలంటే కీలకమైన ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టు నిలబెట్టుకొనేందుకు కొత్త సమీకరణాలను తెర మీదకు తెచ్చారు.
తూర్పు గోదావరిలో కాపు-బీసీ-ఎస్సీ ఫార్ములా అదే విధంగా పశ్చిమ గోదావరిలో కాపు-క్షత్రియ- ఎస్సీ ఫార్ములాను అమలు చేసారు. టీడీపీ ప్రభుత్వం తూర్పు గోదావరిలో ఎస్సీకి అవకాశం ఇవ్వలేదు. అదే విధంగా పశ్చిమలో క్షత్రియకు ఛాన్స్ ఇవ్వలేదు. అయితే, జగన్ వ్యూహాత్మకంగా ఈ రెండు జిల్లాలకు బీసీ-కాపు కోటాల్లో రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టి అందరినీ ఆశ్యర్య పరిచారు. ఇలా ప్రతీ సామాజిక వర్గ పరంగా జగన్ నాటి చంద్రబాబును డామినేట్ చేసేలా సమీకరణాలతో టీడీపీ శిబిరంలో సైతం ఆ జగన్ ..ఈ జగన్ ఏనా అనే సందేహానికి కారణమయ్యారు.