టీడీపీ వాదాన్ని తనువెల్లా నింపుకొన్న దమ్మున్న ఛానెల్ ఎండీ రాధాకృష్ణ రాసిన ఈ వారం కొత్త పలుకు సరికొత్తగా ఉంద నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వారం వారం ఈయన వల్లించే కొత్తపలుకులపై సోషల్ మీడియాలో కామెంట్లు, సటైర్లు కూడా కామన్గానే వస్తున్నాయి. ప్రజల నిర్ణయానికి అనుకూలంగా, ప్రజాభీష్టానికి అనుకూలంగా పనిచేయాల్సిన పత్రికారంగం.. ప్రజలను శాసించే విధంగా మారడం.. ప్రజలకు హుకుం జారీ చేసేలా వ్యవహరించడం వంటి కీలక అంశాలకు ఇలాంటి వారే పునాదులు వేస్తున్నారని అనే విమర్శకులు ఉన్నారు. ఏ పెన్నులోనైనా పోసిన సిరాను బట్టే రంగు కనిపిస్తుంది. కానీ... కొత్తపలుకులో మాత్రం ఏ సిరా పోసినా.. పచ్చదనమే కనిపిస్తుందనే వారు లెక్కకు మిక్కిలి.
రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. దాదాపు రెండు వారాలు పూర్తయింది కూడా. కొత్త కేబినెట్ కూడా కొలువు దీరింది. నూతన సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. తన కేబినెట్ను ఎక్కడా గ్యాప్ లేకుండా మొత్తం పూర్తిగా విస్తరించారు. ఎవరికి ఎక్కడ ఎలాంటి స్థానం ఇవ్వాలో నిర్ణయించుకుని ఆదిశగానే అడుగులు వేశారు. కొందరు కుహనావిమర్శకుల నోటికి, రాతలకు కూడా తాళం వేస్తూ.. తనదైన శైలిలో జగన్ నిర్ణయాలు తీసుకున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్షిస్తానని, టెండర్లను కూడా రివర్స్ చేస్తామని.. జగన్ ప్రకటించారు. అదేసమయంలో రాష్ట్రంలో అవినీతి లేని విధంగా ప్రక్షాళన చేస్తానని చెప్పుకొచ్చాడు జగన్.
ఇక, అదేసమయంలో అటు కేంద్రంలోను, ఇటు పక్కరాష్ట్రం తెలంగాణతోనూ చెలిమి చేసుకుంటూ ముందుకు సాగుతు న్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో నిరుపయోగంగా ఉన్న ఏపీ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించి వాటి మెయింటెనెన్స్ ఖర్చు దాదాపు 8 కోట్లను రద్దు చేసుకున్నారు. ఈ పరిణామాలతో ఇరు రాష్ట్రాల మధ్య స్నేహ భావం పెంపొందుతోంది. అయితే, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నట్టుగానే ఉన్నాయి. ఇదే తరహా పాలన చంద్రబాబు ఎందుకు చేయలేక పోయారనే ప్రశ్నలు ప్రజల్లోకి వస్తున్నాయి. వీటిని గమనించాడో.. ఏమో కొత్త పలుకు రాధాకృష్ణ.. వెంటనే తన కలాని సంధించారు.
తాజాగా రాసిన కొత్త పలుకులో జగన్ను ఒక పక్క మెచ్చుకుంటూనే.,. మరోపక్క, మాత్రం జగన్ తోకఝాడిస్తే.. జైలు తప్పదని హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అంతేకాదు, కేంద్రం-రాష్ట్రం మధ్య తగువులు పెట్టే విధంగా కూడా ఈ పలుకులు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అదేసమయంలో మాజీ సీఎం చంద్రబాబును ప్రత్యేక హోదా విషయంలో కొందరు రెచ్చగొట్టారని, ఆయన రెచ్చిపోయి.. కేంద్రంతో తగువుకు దిగారని, అదే నష్టమైందని సానుభూతి వ్యాక్యలు వల్లించారు. ఇదే నిజమని అనుకుంటే.. ఫార్టీ ఇయర్స్ అనుభవం బాబుకు ఏమైనట్టు? అనేది ప్రాధమిక ప్రశ్నగానే తెరమీదికి వస్తుంది.
ఇక, అప్పట్లో బాబును ధర్మ పోరాటాలకు దిగాలన్న గొంతులు, ఇప్పుడు జగన్కు స్నేహహస్తం అందించాలని పిలుపుని స్తున్నాయని చెప్పడం జగన్ను పొగుడుతున్నారో.. ఇతరులను తిడుతున్నాడో కూడా తెలియని విధంగా వ్యవహరించా రు. ఇక, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం మేమేనంటూ.. బీజేపీ ముందుకు వచ్చింది.. కేంద్రంలోని బీజేపీకి సీబీఐ, ఈడీ వంటి సంస్థలు మోకరిల్లాయి. కాబట్టి ఇక్కడ జగన్ ఇష్టానుసారంగా హోదా అడిగితే తనకే మోసం అంటూ.. ఆర్కే రాసిన రాతలు పూర్తిగా ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నాడో ఇట్టే అర్ధమవుతుంది. రాష్ట్రానికి చెందిన ఆస్తులను తెలంగాణకు ఇవ్వడాన్ని తప్పుపట్టిన ఆర్కే.. అదేసయమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహకర్త అంటూ కొనియాడడం వెనుక ఎక్కడో భీతిల్లిన సందర్భం కనిపిస్తోంది. ఏదేమైనా.. చంద్రబాబు, టీడీపీ ఓటమిని ఇప్పటికీ తట్టుకోలేక పోవడం, బాబు ను సొంత పార్టీ నాయకులే వెనుకేసుకు రాలేని సందర్భంలోనూ ఆయన ఉప్పు తిన్నందుకు ఆర్కే రుణం తీర్చుకుంటున్నాడని అంటున్నారు విశ్లేషకులు.