తోట త్రిమూర్తులు అనగానే కప్పదాట్లు, గోడ దూకుడుకు మారుపేరు. రాజకీయాలు అన్నాక అది ఈ కాలంలో మరీ సహజమై పోగా అందుకు ఒక్క తోట త్రిమూర్తులను మాత్రమే వేలెత్తి చూపాల్సిన పని లేదు. ఎన్నికలకు ముందైనా, తర్వాతైనా ఈ ఫార్ములా ఒక్కటే. ఏ ఎండకు ఆ గొడుగు పట్టాల్సిందే. ముఖ్యంగా ఈ గోడ దూకుడు చాలా తక్కువగా ఉండీ ఉండనట్లు జనమేమైనా అనుకుంటారేమో అన్న చింతనతో నడిచేవి.
టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి దీన్ని టోకువ్యాపారంగా మార్చి గోడ దూకునా సిగ్గుపడాల్సిన పనిలేదన్నట్లు మార్చేశారు. చంద్రబాబు హయాంలో ఇలాంటి వాటి విషయాల్లో సిగ్గు బిడియం నైతికత న్యాయం నీతి అన్నీ వదిలేసి శాసన సభను బహిరంగ సభగా మార్చేశారు. ఆఖరకు సభాపతికే సిగ్గులేనితనం అర్హతగా మారింది. ఇక తోట త్రిమూర్తు లెంత?
ఇప్పుడు ఏపీలో చిత్తుగా ఓడిపోయిన టీడీపీ నాయకులు కూడా ఇదే తరహా సూత్రాన్ని నిశ్శిగ్గుగా పాటించాలని నిర్ణయించు కున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం శాసనసభా స్థానంలో తాజాగా ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయన, కనుచూపు మేర లో కనిపించని టీడీపీ భవితవ్యపు భాగ్యరేఖలతో ఇప్పుడు అందులో ఉండాలా? వద్దా? అనే తర్జన భర్జనలో కొట్టు మిట్టాడు తున్నారు. ఆయితే ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఆయన అనుచరులు కూడా చిందులేస్తున్నారట. దీంతో ఏ క్షణంలో అయినా టీడీపీకి తోట త్రిమూర్తులు వీడ్కోలు పలకనున్నారని ప్రచారం జోరందుకుంది.
*సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తోట త్రిమూర్తులు గతంలో ఇండిపెండెంట్గా విజయం సాధించారు.
*ఆ తర్వాత కాంగ్రెస్ లోనూ ఆయన ప్రయాణం సాగింది.
*ఆ తర్వాత కాపు వర్గాన్ని సమీకరించి తనకు తిరుగులేని ఓటు బ్యాంకును సొంతం చేసుకున్నారు.
*ఈ క్రమంలోనే చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలోకి వెళ్లారు.
*తర్వాత మళ్లీ టీడీపీలోకి వచ్చి 2014ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్పై విజయం సాధించారు.
అదే సమయంలో కాపుకోటాలో తనకు మంత్రిపదవి కావాలని తోట డిమాండ్ చేసినట్టు సమాచారం. దీనిని చంద్రబాబు సున్నితంగా తిరస్కరించారు. ఇక అప్పటి నుంచి ఆయన తాజా ఎన్నికలపై దృష్టిపెట్టారు. అదే సమయంలో చిన్నరాజప్పకు మంత్రి పదవి ఇవ్వడంపై కారాలు మిరియాలు నూరారు. ఇక, తాజా ఎన్నికల్లో విజయం సాధిస్తే మంత్రి పదవి ఇవ్వాలనే షరతును చంద్రబాబుకు పెట్టినట్టు సమాచారం. అయితే దీనిపై చంద్రబాబు నుంచి ఎలాంటి హామీ కూడా రాలేదు.
ఇదిలావుంటే, పూర్వానుభవం దృష్ట్యా ఎన్నికలకు ముందుగానే ఈయన పార్టీ మారడం ఖాయమనే వార్తలు వినిపించాయి. దీనికి ప్రధాన కారణం పలుసార్లు ఆయన వేసిన కప్పదాట్ల అనుభవమే - వైసీపీలో కీలక నేతగా ఉన్న కృష్ణాజిల్లా జగ్గయ్య పేటకు చెందిన సామినేని ఉదయభాను స్వయానా తోటకు వియ్యంకుడు కావడం కూడా మరో కారణం. ఇటు దూకే అనుభవం తనకుండగా వైసీపిలో వియ్యంకుడి అండ ఉండనే ఉంది. అవకాశం కూడా ఆయాచితంగా కనిపించింది కదా! అందుకే ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ తోట దూకుడు వేగం పెరుగుతుందని అంటున్నారు.
సొంత వియ్యంకుడు వైసీపీలో ఉండడం, టీడీపీ హవా మరింత తగ్గిపోతుందనే ప్రచారం జరుగుతుండడం, టీడీపీ నేతలను తన పార్టీలోకి చేర్చుకునేందుకు బీజేపీ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేయటం చూస్తే - టీడీపీ మరింత పలచనయ్యే ప్రమాదం అంతకు మించి అదృశ్యమయ్యే పరిస్థితులు అతి సమీపంలోనే పొంచిఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో తన వియ్యంకుడి సలహామేరకు తోట త్రిమూర్తులు త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని రామచంద్రాపురంలో వివిధ రాజకీయ పార్టీల నేతల మద్య ప్రచారం జరుగుతోంది.
తోట ఇప్పటికే ఓటమి పాలయ్యారు కాబట్టి, రాజీనామా ప్రస్తావన కూడా ఉండదు. ఏ బాదరబందీ లేని తరుణంలో గోడదూక గలిగేవాడికి దూకగలిగినంత అవకాశం ఉంది కదా! కాకపోతే టీడీపీలో ఒక బలమైన వికెట్ పడిపోతే పార్టీ మునిగిపోయే ముహూర్తం అతిదగ్గర్లోనే ఉందని అర్ధమౌతుందని విశ్లేషకుల భావన.