ఏపీలో కొత్తగా ఏర్పడిన జగన్ ప్రభుత్వం పువ్వు పుట్టగానే పరిమళించిన విధంగా సంచలన నిర్ణయాల దిశగా దూకుడు ప్రదర్శిస్తోంది. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టి పట్టమని పది రోజులు కూడా గడవక ముందే ప్రజల నాడిని పట్టేశారు. వారికి ఏం చేస్తే.. తనను జీవితాంతం గుర్తుంచుకుంటారో.. ప్రజలకు ఎలాంటి మంచి పనులు చేస్తే..తన ప్రభుత్వం ఎల్లకాలం పదిలంగా ఉంటుందో గుర్తించి ఆదిశగానే అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ తన నిర్ణయాలతో మెరుపులు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
సీపీఎస్ రద్దు విషయంపై వెంటనే నిర్ణయం తీసుకున్న జగన్ను ఉద్యోగులు భారీ ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజానికి ఈసమస్య వివిధ రాష్ట్రాల్లో ఉంది. పక్కనే ఉన్న తమిళనాడులో కూడా ఈ సమస్య పరిష్కారంపై అక్కడి పాలకులు కూడా కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారు. ఇక, చంద్రబాబబు ప్రభుత్వం కూడా కమిటీ వేసింది. ఆయన హయాంలోనే నిర్ణయం తీసుకుంటారని, ఉద్యోగులతో ఫ్రెండ్లీ పాలిటిక్స్ నడిపారు. ఆయన కూడా దీనిపై కాలయాపన చేశారనే పేరు తెచ్చుకున్నారు. కానీ, ఇప్పుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్ నిర్ణయం తీసుకోవడాన్ని ఉద్యోగులు నమ్మలేకపోతున్నారు.
అదే సమయంలో ఆర్టీసీ విలీనం అంశం.. జగన్ను ఆకాశానికి ఎత్తేసింది. ఈ ప్రక్రియ చాలా దూకుడుతో కూడిన నిర్ణయం దాదాపు 9 వేల కోట్ల అప్పుల నుంచి ఆర్టీసిని బయటపడేయడంతోపాటు.. సంస్థలోని డ్రైవర్లు, కార్మికులకు ఉద్యోగ భద్రతను కల్పించే ఈ నిర్ణయంపై కూడా జగన్ చాలా సత్వరమే నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఇలాంటి విషయాన్ని జగన్ తాత్సారం చేసినా ఎవరూ ఏమీ అనే పరిస్థితి లేదు. కానీ, లక్షల మందితో కూడుకున్న నిర్ణయాలు కావడంతో జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలు ఆయా వర్గాలకుమేలు చేయడంతోపాటు జగన్ను ప్రజలకు మరింత చేరువ చేసిందనే చెప్పాలి.