ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బోణి అదిరింది. పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనలో ఆరంభంలోనే జగన్ సారథ్యంలోని ప్రభుత్వంతో కీలక సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. భారతదేశంలోని మంచి నాణ్యత గల ఉత్పత్తిగా పేరొందిన అల్ట్రాటెక్ సిమెంట్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో రూ.2వేల 500కోట్ల భారీ ప్రాజెక్టు చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వడంతో కర్నూలు జిల్లాలోని పెట్నికొటె గ్రామంలో ఈ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టారు.
ఐదు దేశాల్లో విస్తరించిన ఆదిత్య బిర్లా గ్రూపు సంస్థల్లో ఒకటే ఈ అల్ట్రాటెక్ సిమెంట్. ఈ కంపెనీ ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంటును ఏర్పాటు చేసి 900 మందికు పైగా ఉపాధి కల్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నివారణ బోర్డు నుంచి అనుమతులు వస్తే.. ఇక ప్లాంటు మొదలైపోయినట్లే. ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 2500 కోట్లతో 431.92హెక్టార్ల భూమిని ఇప్పటికే కంపెనీ కొనుగోలు చేసింది. అంతకుముందు ఉన్న బిల్డింగ్లు, లేదా మరే ఇతర రకమైన సదుపాయాలను వాడుకోకుండా పునాదుల నుంచి కొత్తగా ఈ ప్రాజెక్టును అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ రూపొందించనుంది.
కాగా, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో పెట్టుబడుల కల్పన ఓ ప్రహసనంగా, నవ్వులాటగా మారిన సంగతి తెలిసిందే. బడా కంపెనీలతో ఒప్పందాలంటూ బాబు ప్రభుత్వం ఆర్భాటం చేసి వేల కోట్లు ముంచేశారని ఆరోపణలు వచ్చాయి. తమకు నచ్చిన కంపెనీలకే వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టినట్లు కాగ్ సైతం తేల్చింది. ఈ రకంగా సాగిన పెట్టుబడుల ప్రహసనానికి భిన్నంగా జగన్ హయాంలో పారదర్శకంగా నిర్ణయాలు వెలువడుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.