ఆంధ్రప్రదేశ్కు కొత్త గవర్నర్ ఖరారు అనే ఎపిసోడ్ ఊహించని మలుపులు తిరుగుతోంది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ను నియమించబోతున్నట్టు ఇవాళ ఉదయం జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కొత్త గవర్నర్ను నియమించే అంశాన్ని పరిశీలిస్తున్న కేంద్రం.. ఆ పదవికి సుష్మాస్వరాజ్ను ఎంపిక చేయబోతున్నట్టు బీజేపీ వర్గాల ద్వారా సమాచారం అందిందని కథనాలు కనిపించాయి. ఈ ఎన్నికల్లో సుష్మాస్వరాజ్ పోటీ చేయలేదు. ఆమెతోపాటు మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా బరిలోకి దిగలేదు. వీరిద్దరినీ గవర్నర్లుగా పంపిస్తారని జాతీయ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి.
అయితే, సుష్మాస్వరాజ్ నియామకం ఊహాగానాలే అనుకుంటున్న సమయంలో.. 'ఏపీ గవర్నర్గా నియమితులైన సుష్మాస్వరాజ్కు శుభాకాంక్షలు' అంటూ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. ఐతే.. కొద్దిసేపటికే ఆయన ఆ ట్వీట్ను డిలీట్ చేశారు. ఈ నేపథ్యంలో.. ఏపీ గవర్నర్గా సుష్మ నియమితులయ్యారా లేదా అనే విషయమై ఉత్కంఠ నెలకొంది.
ఇదిలాఉండగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కలిశారు. దాదాపు గంటకు పైగా సాగిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. భేటీ అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. మర్యాదపూర్వకంగానే హోంమంత్రిని కలిసినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా ముందుకు సాగుతున్నట్లు వివరించినట్లు వెల్లడించారు. పెండింగ్లోని విభజన సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయన్నారు. తొలుత హైదరాబాద్లోని భవనాల సమస్యను పరిష్కరించినట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య అన్ని సమస్యలు తీరిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.