కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో నియమించబడ్డ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కొనసాగే అవకాశం ఉందా! అనే ప్రశ్నకు సమాధానం లేదంటే లేదని చెప్పేస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దారే వేరు వైవిధ్యం. ఆయన మాజీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు అత్యంత నమ్మకస్తుడు, వీర విధేయుడిగా చెబుతారు. అందుకే ఆనాడు ఆయనను అవిభాజిత ఏపికి గవర్నర్ గా పంపారు.
తర్వాతి కాలంలో యూపీఏ ప్రభుత్వంపోయి, ఎన్డీయే ప్రభుత్వం వచ్చింది. యూపీఏ పాలనాకాలంలో నియమించబడ్డ ఎంతోమంది గవర్నర్లను ఇంటికి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఒక్క నరసింహన్ తో పాటు, తమిళనాడు గవర్నర్ రోశయ్యలను మాత్రం మార్చలేదు. కాకుంటే పదవీకాలం ముగిసిన వెంటనే రోశయ్యను ఇంటికి పంపారు. కానీ, అందుకు విరుద్ధంగా నరసింహన్ ను మాత్రం కొనసాగుతూ వస్తున్నారు.
ఒకప్పుడు సీబీఐ అధినేతగా పని చేసిన అనుభవం ఉండటం, ప్రధాని నరేంద్ర మోడీతో నరసింహన్ కు గతంలోనే ఉన్న పరిచయం కూడా ఆయన అదే పదవిలో కొనసాగ టానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
యూపీఏ హయాంలో గవర్నర్ పదవిలో ప్రవేసించిన నరసింహన్ దాదాపుగా పదేళ్ల నుంచి హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో "మోస్ట్ పవర్ ఫుల్ పర్సన్" ఎవరంటే ఇద్దరు ముఖ్యమంత్రులను మించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ కాకుండా వెరవరినీ చెప్పలేము.
ఎవరి వద్ద ఎలా ఉండాలో? ఎలా ప్రవర్తించాలో "నొప్పించక తానొవ్వక చెప్పిన పనులు క్రమం తప్పక చేయువాడు దన్యుడన్న రీతి" లో అడుగులు వేయటం అధినేతల మనసెరిగి పనిచేయటం ఆయనకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదని చెబుతారు. ఈ కారణంతోనే ముఖ్యమంత్రులు వరుసపెట్టి మారుతున్నా, గవర్నర్ పోస్ట్ మాత్రం మారకపోవటం ఇప్పుడు హాట్-టాపిక్ గా మారింది.
నరసింహన్ ప్రస్తుత పదవీకాలం ఈ డిసెంబరు నాటికి పూర్తి అవుతుందని, ఈసారికి మాత్రం మరో రెన్యువల్ ఉండకపోవచ్చన్న విషయం బలంగా వినిపిస్తోంది. అవసర మైతే వేరే రాష్ట్రానికి పంపటమో, ఇంకేదైనా నిర్ణయం తీసుకోవటం చేస్తారని, రెండు తెలుగు రాష్ట్రాలకు తాజాగా భారతీయ జనతా పార్టీ నేపద్యం ఉన్న వారికే ఈసారి గవర్నర్ పదవి దక్కుతుందని అంటున్నారు. ఉభయ రాష్ట్రాల్లో బీజేపి వ్యాప్తి చెందాలన్న బలమైన భావనతో ఉన్న ఈ సందర్భంలో కాంగ్రెస్ వీర విధేయుణ్ని గవర్నర్ గా కొనసాగించటం జరగని పని. అందుకే అదీ ఆయన పదవీ కాలం పూర్తయ్యక అంటే 2020 లో గవర్నర్ మార్పు తధ్యం
అదే జరిగితే తమ ఆలోచనల్ని, వాదనల్ని గవర్నర్ గారి ద్వారా ప్రధానికి పంపుతున్న ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల పరిస్థితి ఏమిటి? అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారనుందనేది విశ్లేషకుల భావన.