పంజాబ్ లోని సంగర్రులో బోరుబావిలో బాలుడి కథ విషాదంగా ముగిసింది. బోరు బావిలో పడిన రెండేళ్ల బాలుడు ఫతేవీర్ సింగ్ మృతి చెందాడు. 5 రోజుల క్రితం ఆడుకుంటూ వెళ్లి మూతలేని బోరుబావిలో చిన్నారి ఫత్వీర్ సింగ్ ప్రమాదవశాత్తూ పడిపోగా, విషయం తెలుసుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు, బాలుడిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ప్రారంభించాయి. ఎంతో శ్రమకు ఓర్చి బాలుడిని ఎలాగోఅలా బయటకు తిసినా ఫలితం దక్కలేదు. బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. బాలుడు చనిపోయినట్టు నిర్ధారించారు.
బాలుడిని ప్రాణాలతో కాపాడేందుకు రెస్క్యూ టీమ్ చేసిన విశ్వప్రయత్నం విఫలమైంది. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలుడు 150 అడుగుల లోతున ఉన్నాడని తెలుసుకున్న అధికారులు, సీసీ కెమెరాలను పంపి బాలుడు ప్రాణాలతోనే ఉన్నాడని గుర్తించారు. ఆపై అతనికి ఆక్సిజన్ పంపుతూ, నాలుగున్నర రోజుల పాటు వెలికితీసే ప్రయత్నాలు చేయగా, అవి గత రాత్రి ఫలించాయి. బావికి సమాంతరంగా గోతిని తవ్విన రెస్క్యూ టీమ్.. సహాయక చర్యలు చేపట్టింది.
110 గంటల పాటు శ్రమించి బాలుడిని బటయకు తీసుకొచ్చింది. బాలుడిని కాపాడేందుకు ఐదు రోజుల పాటు తీవ్రంగా శ్రమించారు. ప్రాణాలతోనే ఉన్న చిన్నారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న బాలుడు మరణించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా..బాలుడు మరణించాడు.
దీంతో సంగ్రూర్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ బిడ్డ బయటకు వచ్చాడన్న ఆనందం నిమిషాల్లోనైనా లేకుండా పోయింది. తల్లిదండ్రుల తాము చేసిన పూజలు దేవుడికి చేరలేదని గ్రామస్థులు సైతం బోరున విలపించారు.