ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఒక తియ్యని కబురు చెప్పింది. అనంతపురం నుంచి అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణానికి పచ్చ జండా ఊపింది. ఇది నిర్ద్వంధంగా సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రానికి సాధించి పెట్టిన గురుతర విజయం. ఇది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకెంతో ఆనందదాయకం. వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైయస్ జగన్మోహనరెడ్డి తొలిసారిగా సచివాలయంలో (సెక్రటేరియట్) ఈనెల 8న అడుగు పెట్టిన తర్వాత జగన్ చేసిన తొలి మూడు సంతకాలలో ఒకటి అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం సాధనపై ఆయన సంతకం చేశారు. సంతకం చేసిన మూడు రోజులలోపే ఆ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అంగీకారం తెలపడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
గత ప్రభుత్వం సంకీర్ణమై ఉండీ కేంద్రంతో నాలుగేళ్ళ మైత్రి, ఒక సంవత్సరం శత్రుత్వం వహించి ఏపి ప్రజలకు కేంద్రంలోని బీజెపికి మద్య చిచ్చుపెట్టి నానాయాగి చేసిందే గాని – రాజకీయాలే తప్ప హృదయపూర్వక ప్రయత్నమేది చేసింది లేదు. సంకల్పం లేని ప్రయత్నాలు పలించవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిన ఎక్స్ప్రెస్ హైవే కి అంగీకరిస్తున్నట్లు స్పష్టం చేసిన కేంద్రం ఆ ప్రాజెక్టు అంచనా వ్యయం ₹27300 కోట్లు. అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలను కలుపుతూ సుమారు 600 కిలోమీటర్ల పొడవైన 6/4 లైన్లతో నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ ఎక్స్ ప్రెస్ హైవే ప్రత్యేకత ఈ రహదారిపై 120 కిమీ వేగం తో వాహనాలు ప్రయాణించతగిన విధంగా రహదారి నిర్మించడం.
దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణానికి ₹ 120000 వేల కోట్లు అవసరమని అందుకు సహకరించాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. జూలై 5న పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, వాటిని పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులపై ఆర్ధికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో నితిన్ గడ్కరీ చర్చించారు.
అందులో అనంతపురం-అమరావతి నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ ప్రతిపాదనలను కూడా పొందుపరిచారు. అనంత పురం- అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణా నికి, ₹ 30000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయగా తొలివిడత గా ₹27300 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. కేంద్రప్రభుత్వం నిర్మించనున్న నేపథ్యంలో కేంద్రబడ్జెట్ నుంచి ఈ నిధులు నేరుగా రాష్ట్రానికి మంజూరు చేయవచ్చునని తెలుస్తోంది. కేంద్రం ఆమోదముద్ర వేయడంతో ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణానికి మార్గాలను రూపొందించడంపై కసరత్తు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. మెుత్తం అయిదు మార్గాలను అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
*అనంతపురం జిల్లా మారూరు నుంచి మెుదలయ్యే ఈ హైవే మొదటి మార్గం తాడిపత్రి, గిద్దలూరు, కంభం, ప్రత్తిపాడు, సత్తెనపల్లి మీదుగా విజయవాడ ‘ఇన్నర్ రింగ్ రోడ్డు’ ను అనుసంధానిస్తుంది.
*రెండో ఆప్షన్గా అనంతపురం, తాడిపత్రి, ఉయ్యాలవాడ, రుద్రవరం, గిద్దలూరు, బెస్తవారి పేటగా నిర్ధారించారు.
*చిత్తూరు మినహాయించి మూడో మార్గంగా అనంతపురం సమీపంలోని మామిళ్ల పల్లి నుంచి ఆరంభం అయ్యే ఎక్స్ప్రెస్ వే - రైల్వే కొండాపురం, ముద్దనూరు, యర్రగుంట్ల, కమలాపురం, మైదుకూరు, వనిపెంట, కనిగిరి, దర్శి, కావూరు, ఫిరంగిపురం మీదుగా శాఖమూరు వద్ద ముగుస్తుంది.
*ఇక తుది ఆప్షన్ గా అనంతపురం, నార్పల, యర్రగుంట్ల, వనిపెంట, పోరుమామిళ్ల, తాటిచెర్ల, బెస్తవారిపేట, దర్శి, కొమ్మాలపాడు, కావూరు, ఫిరంగిపురం, సిరిపురంగా నిర్ణయించారు.
వీటితో మరొకటి కలిపి మొత్తం ఐదు ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచనుంది ఏపీ ప్రభుత్వం.
ఇకపోతే ఈ ఐదు ఆప్షన్లలో చిత్తూరు జిల్లాను మినహాయించడం విశేషం. అనంతపురం-అమరావతి ఎక్స్ ప్రెస్ హైవేకు 544 ఎఫ్ గా గుర్తింపు ఇచ్చింది కేంద్రప్రభుత్వం. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేగా నిర్మిస్తున్న రహదారికి జాతీయహోదా ప్రకటించింది. అయితే ఈ రహదారి నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం తన వాటాగా 30 శాతం ఖర్చును భరించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం పెట్టిన షరతుకు ఏపీ సీఎం జగన్ అంగీకారం తెలిపారని తెలుస్తోంది. మెుత్తానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసి నెలరోజులు కాకముందే కార్యసాధకుడుగా కీలక ప్రాజెక్టును సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.