వైకాపా కు చెందిన ఎమ్మెల్యేనే ఆ పార్టీకి షాకిచ్చారు. జీవోను రద్దు చేయాలంటూ రైతులతో కలిసి ధర్నాకు దిగారు. సమస్యకు పరిష్కారం దొరికే వరకు వెనక్కు తగ్గలేదు. ఏకంగా ముఖ్యమంత్రి స్పందించాల్సి వచ్చింది. ప్రకాశం జిల్లాలో రాళ్లపాడు ప్రాజెక్ట్ విషయంలో వివాదం రేగింది.
రాళ్లపాడు నుంచి కామధేనువు ప్రాజెక్టుకు నీరు తరలించేలా గత ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఈ జీవోను రద్దు చేయాలంటూ రాళ్లపాడు ప్రాజెక్ట్ దగ్గర కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు.
అయితే, ఈ ఎమ్మెల్యే ధర్నా వ్యవహారం వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి దృష్టికి వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన సుబ్బారెడ్డి.. సమస్యపై ఆరా తీసి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన జగన్.. ప్రాజెక్టకు సంబంధించిన జీవోను రద్దు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.
సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇలా ధర్నాకు దిగడం.. దానిపై ముఖ్యమంత్రి స్పందించి హామీ ఇవ్వడంతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతుల సమస్యలు తెలిసిన జగన్ ముఖ్యమంత్రిగా ఉండటం తమ అదృష్టంగా చెప్తున్నారు.