రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాజకీయ పరిణామాలు వడివడిగా మారుతున్నాయి. అధికారంలోకి వ చ్చిన వైసీపీ వేగంగా పనులు చేసుకుంటూ పోతుంటే.. ఓటమి పాలైన టీడీపీలోని నాయకులు అంతే వేగంగా పార్టీ మారేం దుకు, బాబు బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ముఖ్యమైన నాయకులు త్వరలోనే టీడీపీకి దూరమయ్యే యోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతా యోనని పార్టీలోని కీలక నేతలు చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గంలో తాజా ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు టీడీపీ ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్న కాపు వర్గానికి చెందిన బొండా ఉమా మహేశ్వరరావు. అధికారంలో ఉండగా .. వైసీపీపై తీవ్రస్తాయిలో విరుచుకుపడి, నియోజకవర్గంలోని టీడీపీ నాయకులను తన లైన్లో పెట్టుకున్న ఆయనకు ఇప్పుడు వైసీపీ చేతిలో ఓటమి ఎదురైంది. చివరి నిముషం వరకు గట్టిగానే పోటీ ఇచ్చినప్పటికీ.. చివరి నిముషంలో కేవలం 25 ఓట్లతేడాతో ఆయన వైసీపీ నేతపై ఓటమి పాలయ్యారు.
తాజా ఎన్నికల్లో జగన్ సునామీ కారణంగా కీలక నేతలు చాలా మంది ఓడిపోయిన నేపథ్యంలో పెద్దగా చర్చకు రాలేదు. అయితే, ఇప్పుడు ఈ నియోజకవర్గంలో బొండా ఉమాకు రైట్ హ్యాండ్గా వ్యవహరించిన కార్పొరేటర్ జగదీష్ తన పదవికి రాజీనామా చేశారు. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. తన పదవితోపాటు పార్టీకి కూడా రాజీనామా చేసేందుకు ఆయన రెడీ కావడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఎస్సీ వర్గానికి చెందిన జగదీష్.. కృష్ణా జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం తిరువూరు నుంచి తాజా ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు. ఈ విషయంలో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న ఉమాపై ఆయన ఒత్తిడి తెచ్చారు.
అంతేకాదు, ఈ టికెట్ ఇప్పిస్తానని, చంద్రబాబుకు పరిచయం చేస్తానని హామీ ఇచ్చిన బొండా ఉమా.. జగదీష్ నుంచి భారీ మొత్తంలోనే డబ్బులు తీసుకున్నట్టు తాజాగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య గత కొన్ని రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయని సమాచారం. ఈ క్రమంలో జగదీష్ టీడీపీ తరఫున లభించిన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయడంతోపాటు త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. కాగా, ఈ పరిణామం.. ఉమా వర్గంలో సంచలనం సృష్టిస్తోంది. సెంట్రల్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో ఉమా చేసిన ``కార్యక్రమాల`` లోగుట్టు అంతా జగదీష్కు తెలిసి ఉండడం, ఇప్పుడు విభేదించి బయటకు వస్తుండడంతో ఆయన ఏమైనా బయట పెడితే.. ఏం జరుగుతుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.