విచారణ సందర్భంగా ధర్మాసనం..'అతని ట్వీట్లను మేం మెచ్చుకోకపోవచ్చు. కానీ, సామాజిక మాధ్యమాల్లో ఆ పోస్టులకుగాను అతడిని జైలులో ఉంచాలా అనేదే అసలు ప్రశ్న. ఇదేమైనా హత్య కేసా? వాస్తవంగా ఒక వ్యక్తిని 11 రోజుల పాటు జైలులో ఉంచాల్సిన కేసు కాదిది. అతనిని ప్రభుత్వం ఔదార్యంతో విడుదల చేయాలి' అని ధర్మాసనం తెలిపింది.
' ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు, స్వేచ్ఛ హక్కు నిరాకరణకు గురైనప్పుడు న్యాయస్థానం చేతులు ముడుచుకు కూర్చోలేదని' పేర్కొంది. ఆర్టికల్ 142 ప్రకారం స్పందించే బాధ్యత తమకుందని తెలిపింది. అసలు ఏం జరిగింది? లక్నోలోని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కార్యాలయం వెలుపల ఒక మహిళ మీడియాతో తాను సీఎంకు పెళ్లి ప్రతిపాదన చేసినట్లుగా చెబుతున్న వీడియోను జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియా ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్టు చేశారు.
దీంతో సీఎంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి, ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నించారంటూ కనోజియాతోపాటు అతడు పనిచేస్తున్న నేషన్ లైవ్ టీవీ చానల్ ఎడిటర్ అనూజ్ శుక్లా, అధిపతి ఇషికా సింగ్లపై లక్నోలోని హజరత్ గంజ్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది. ఈ కేసు విచారించిన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్.. పై ముగ్గురికీ దాదాపు రెండు వారాల పాటు అంటే ఈనెల 22 వరకు రిమాండ్లో ఉంచాలంటూ ఆదేశాలు జారీ చేశారు.( cartoon by Subhani/deccon chronicle )