అవును గుంటూరు జిల్లాలో
ఇపుడిదే విషయంపై చర్చ జరుగుతోంది. కోడెల కుటుంబం బాధితులకు న్యాయం జరగాలంటే
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)తో విచారణ జరిపించాల్సిందే అంటూ డిమాండ్లు
పెరుగుతున్నాయి. డిమాండ్లకు జగన్మోహన్ రెడ్డి కూడా సానుకూలంగా ఉన్నట్లు ప్రభుత్వ
వర్గాలు చెబుతున్నాయి. తండ్రి కోడెల శివప్రసాదరావు స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకుని కొడుకు, కూతురు చేసిన
అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.
మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఓడిపోయి వైసిపి అధికారంలోకి వచ్చింది. దానికితోడు కోడెల కూడా ఓడిపోయారు. దాంతో కోడెల కుటుంబ బాధితులంతా ఒక్కొక్కళ్ళుగా బయటకు వస్తున్నారు. బాధితుల్లో చాలామందికి ఇంకా కూతురు విజయలక్ష్మి, కొడుకు శివరామ కృష్ణ ఒత్తిళ్ళు పెడుతున్నారట విషయాలు బయటపెట్టొద్దని.
ఏదైమనా సరే కూతురు, కొడుకుపై ఇప్పటికి పది కేసులు నమోదు చేసుంటారు పోలీసులు. ఇంకా చాలామంది ఫిర్యాదులు ఇవ్వటానికి క్యూ కడుతున్నారట. ఇదేదో హుద్ హుద్ తుపాను బాధితుల్లాగానో లేకపోతే ఆగ్రిగోల్డ్ బాధితుల్లాగానో ఉంది చూస్తుంటే కోడెల బాధితుల జాబితా.
ఇప్పటి వరకూ బాధితులిచ్చిన ఫిర్యాదులను చూస్తుంటే వాళ్ళ అరాచకాలు కోట్ల రూపాయల్లోకి చేరుకున్నాయి. భూములు ఆక్రమించుకున్నారు. బెదిరించి కోట్లలో డబ్బులు దోచుకున్నారు. ఇంటి స్ధలాలను కబ్జా చేశారు. వర్తక, వ్యాపారస్తులను బెదిరించి లక్షల్లో గుంజుకున్నారు. కాంట్రాక్టర్లకు టెర్గెట్లు ఫిక్స్ చేసి లక్షల రూపాయలు వసూలు చేశారు. ఎదురు తిరిగిన వాళ్ళను చచ్చేట్లు కొట్టించి పోలీసులతో ఎదురు కేసులు పెట్టించి జైళ్ళకు పంపారు. ఒకటా రెండా చెప్పటానికి.
అందుకనే కోడెల కుటుంబ సభ్యుల అరాచకాలు బయటకు రావాలన్నా, వాళ్ళకు శిక్షలు పడాలన్నా, బాధితులకు న్యాయం జరగాలన్నా సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) వేయాల్సిందేనంటూ జిల్లాలో డిమాండ్ మొదలైంది. సిట్ ఏర్పాటు కోసం బాధితులంతా వైసిపి ప్రజా ప్రతినిధులను కలిసి డిమాండ్ చేస్తున్నారట. అంటే పై అరాచకాలన్నీ కోడెల శివప్రసాద రావుకు సంబంధం లేదు సుమా. స్పీకర్ గా కోడెల చేసిన అరాచకాలు, అవినీతి మళ్ళీ వేరే ఉంది.